Sushmitha Konidela: మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత డిజైనర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. చిరు నటించిన ఖైదీ నంబర్ 150, సైరా నరసింహా రెడ్డి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేశారు. ఆ తర్వాత భర్త విష్ణు ప్రసాద్తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ క్రమంలోనే షూట్అవుట్ అట్ ఆలేరు అనే వెబ్సీరీస్నూ నిర్మించారు. ప్రముఖ ఓటీటీ వేదికైన జీ5లో ఈ సిరీస్ విడుదలై మంచి టాక్ అందుకుంది. దీంతో వెండితెరపైనా తన నిర్మాణ సంస్థను విస్తరించేందుకు సిద్ధమైయ్యారు సుష్మిత. ఇటీవలే నటుడు సంతోష్ శోభన్ హీరోగా రానున్న శ్రీదేవి శోభన్బాబు అనే సినిమానూ ప్రకటించారు. దీంతో పాటు సినిమా పోస్టర్నూ విడుదల చేశారు. తాజాగా, ఈ సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడించారు సుష్మిత. దీంతో పాటు దీపావళి సందర్భంగా మరో కొత్త ప్రాజెక్టు వివరాలను ప్రకటించారు.
దీపావళి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు సుష్మిత. తొలుత శ్రీదేవి శోభన్బాబు సినిమా విశేషాలు పంచుకున్నారు సుష్మిత. ఈ సినిమాలో సంతోష్ శోభన్, గౌరీ కిషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాగబాబు, రోహిణీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ కుమార్ డైరెక్టర్గా పరిచయం కానున్నారు. దీంతో పాటు ‘సేనాపతి’ పేరుతో మరో సినిమాను కూడా రూపొందించనుంది సుస్మిత. రాజేంద్ర ప్రసాద్, నరేష్ అగస్త్య, హర్షవర్ధన్, జీవన్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.గతంలో ‘సావిత్రి’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’ వంటి చిత్రాలను రూపొందించిన పవన్ సాదినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.