ప్రముఖ రచయితగా, జర్నలిస్ట్గా శోభా డేకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. తన రచనలు, వ్యాఖ్యల ద్వారా చాలా సార్లు విమర్శలు ఎదుర్కొందామె. మెగా ఫ్యాన్స్ ఇప్పుడామెను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవికి శ్రద్దాంజలి తెలుపుతూ ఆమె ఓ ట్వీట్ చేసింది. చిర్రెత్తుకొచ్చిన మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలోను ఆమెను ఓ ఆటాడుకుంటున్నారు. అయితే, ఆమె ఇలా తప్పులో కాలేయడానికి కారణం లేకపోలేదు. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన యువ హీరో చిరంజీవి సర్జా శ్వాస సంబంధ సమస్యలతో ఆదివారం చనిపోయారు. కన్నడలో దాదాపు 20 చిత్రాల్లో హీరోగా నటించిన ఆయన యాక్షన్ కింగ్ అర్జున్కు మేనల్లుడు.
సర్జా మృతి పట్ల సంతాపం తెలిపిన శోభాడే.. ఆయన ఫొటోకు బదులు మెగాస్టార్ చిరంజీవి ఫొటోను ట్విటర్లో షేర్ చేసి నివాళులు అర్పించింది. ‘మరో వర్ధమాన నటుడు ఈ లోకం వదిలి వెళ్లాడు. ఇది తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ట్వీట్ చేసింది. సర్జా పేరును ట్యాగ్ చేసిన ఆమె ఫొటో మాత్రం మెగాస్టార్ది పెట్టి తప్పులో కాలేశారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించారు. కన్నడ చిరంజీవికి… మెగాస్టార్ కు తేడా తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. ఆమె అంత అజ్ఞాని మరొకరు లేరని, మద్యం మత్తులో ఈ ట్వీట్ చేసినట్టున్నారని విమర్శిస్తున్నారు. విషయం తెలుసుకున్న శోభ తన ట్వీట్ను తొలగించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.