Homeఎంటర్టైన్మెంట్విషాదం : ప్రముఖ నటుడు మృతి !

విషాదం : ప్రముఖ నటుడు మృతి !

ప్రముఖ సీనియర్ నటుడు పొట్టి వీరయ్య ఇకలేరు. గత నాలుగు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తన నివాసంలో కన్నుమూశారు. తెలుగు సినీ పరిశ్రమలో మరుగుజ్జు నటుడిగా వీరయ్యకి ప్రత్యేక స్థానం ఉంది. వీరయ్యది నల్గొండ జిల్లా, తిరుమలగిరి తాలూకా ఫణిగిరి గ్రామం. ఇతని తల్లి పేరు గట్టు నరసమ్మ. నాన్న పేరు గట్టు సింహాద్రయ్య. వాళ్లకు వీరయ్య రెండో సంతానం. హైస్కూల్‌ వరకూ చదువుకున్న వీరయ్య చిన్నతనం నుండే స్కూల్లో, వేదికలపై నాటకాలు వేసేవారు.

ఆ నాటకాల పై ఉన్న ఆసక్తితోనే అనంతరం నటుడు అవ్వాలని మద్రాసు చేరుకుని అవకాశాలు కోసం నానా కష్టాలు పడ్డారు. తొలుత సినిమాలకు డెకరేషన్‌ చేసే ప్లవర్‌ షాపులో కొంతకాలం పనిచేశారు కూడా. ఆ సమయంలో హీరో శోభన్‌బాబును కలిసి తన దీనస్థితిని చెప్పడంతో ‘వీరయ్య నీకు వేషాలు ఇవ్వాలంటే విఠాలాచార్య, భావన్నారాయణ లాంటి వారు మాత్రమే ఇవ్వగలరు. వెళ్లి వాళ్ళను కలువు’ అని శోభన్ బాబు సలహా ఇచ్చారు. అలా వీరయ్య వెళ్లి విఠలాచార్యను కలిశారు. ఆయన వీరయ్యకు అవకాశం ఇచ్చారు. ఆ తరువాత దర్శకరత్న దాసరి తనని ఎంతో ప్రోత్సహించారని పొట్టి వీరయ్య ఓ సందర్భంలో చెప్పుకున్నారు.

దాసరి ప్రోత్సాహంతో తాతమనవడు చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత ‘రాధమ్మ పెళ్లి’, ‘జగన్మోహిని’, ‘యుగంధర్‌’, ‘గజదొంగ’, ‘గోల నాగమ్మ’, ‘అత్తగారి పెత్తనం’, ‘టార్జాన్‌ సుందరి’ తదితర చిత్రాల్లో పొట్టి వీరయ్య నటన ఆకట్టుకుంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 500లకు పైగా చిత్రాల్లో వీరయ్య నటించారు. ఇక వీరయ్య భార్య మల్లిక 2008లో కన్నుమూశారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. చిన్న కుమార్తె విజయదుర్గ సినిమాల్లోనూ నటించారు. వీరయ్య మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది.

అలాగే సినీ ప్రముఖులు మరియు ఆయన శ్రేయోభిలాషులు వీరయ్య మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఓకేతెలుగు.కామ్ తరఫున పొట్టి వీరయ్య మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version