Hero Nani: ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారం పెద్ద సమస్యగా మారిపోయింది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఏపీలో సినిమా టికెట్ల విధానంపై తమదైన శైలిలో సెటైర్లు వేస్తూ పోస్ట్ చేశారు. త్రివిక్రమ్ కూడా ఒక పేదవాడి కథ అంటూ జగన్ పాలనపై ట్వీట్ చేశాడు. తాజాగా, సీనియర్ నటుడు బ్రహ్మాజీ కూడా తనదైన స్టైల్లో అందరికీ వరాలు ఇస్తున్నారు.. వాళ్ల మీద కూడా కనికరం చూపండంటూ.. పోస్ట్ చేశాడు. తెలంగాణ థియేటర్లలో పార్కింగ్ ఫీసుతో పోలుస్తూ మరి ఏపీ సర్కారు నిర్ణయంపై సెటైర్లు వేశారు.

మరోవైపు, డిస్ట్రిబ్యూటర్లు ఈ రేట్లతో సినిమాలు వేసి నష్టాల్లో కూరుకుపోయే కన్నా.. థియేటర్లు మూసేసుకోవడమే మంచిదని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని థియేటర్లను మూసేశారు. ఈ విషయంపై డిస్ట్రిబ్యూటర్లు కోర్టుకెళ్లినప్పటికీ.. ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. తాజాగా, ఈ విషయంపై టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా డిసెంబరు 24న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఆయన.. ఏపీ టికెట్ ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదు. ఇలా చేయడం ప్రేక్షకులను అవమానించడమే అవుతుంది. థియేటర్ రన్ అవ్వడం వల్ల 10 మందికి ఉపాధి లభిస్తుంది. కానీ, ఈ ధరలను చూస్తుంటే.. టికెట్ కౌంటర్ కంటే.. పక్కనే ఉన్న కిరాణా షాప్లో ఎక్కవ లాభాలొస్తున్నాయి. అని చెప్పుకొచ్చారు.