
దేశంలో ఒకరోజు నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 2,56,828. ఇది ఇప్పటి వరకు హయ్యెస్ట్ రికార్డు. ఈ నంబర్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరణాలు కూడా ఇదే స్థాయిలో సంభవిస్తున్నాయి. ఒక రోజు మరణాలు 2 వేల దగ్గరకు వచ్చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. కానీ.. ఇంత జరుగుతున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దానికి పెరుగుతున్న కేసులే నిదర్శనం.
ఇలాంటి పరిస్థితుల్లో జనాలకు సెలబ్రిటీలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు సలహాలు, సూచనలు చెప్పారు. తాజాగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు. ఇలాంటి సమయంలో నిర్వర్తించాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. ఆయన ఏమన్నారంటే…
‘‘అసాధారణ సమయాల్లో అసాధారణ చర్యలు అవసరం. మాస్కు ధరించండి. పరిసరాలను శుభ్రపరచండి. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. తప్పనిసరిగా టీకాలు వేయించుకోండి. మనం ఇంతకు ముందే ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాం. మళ్లీ యుద్ధం చేద్దాం. మాస్క్ ధరించండి – సురక్షితంగా ఉండండి – బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండండి’’ అని అన్నారు.
ఇక, మహేష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నాడు ప్రిన్స్. కొవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలోనూ నిబంధనలు పాటిస్తూ.. జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లోపాల్గొంటున్నారు. వచ్చే ఏడాది రాజమౌళితో సినిమా ఉన్న నేపథ్యంలో.. ఈ చిత్రం త్వరగా పూర్తి చేసి, మధ్యలో త్రివిక్రమ్ తో మరో సినిమా చేయాల్సి ఉంది. అందుకే.. వేగంగా సర్కారువారి పాటను ఫినిష్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.