Mahesh Babu: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఒకే రోజు 30 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించాడు మహేష్ బాబు. ఈ విషయాన్ని మహేష్ బాబు భార్య నమ్రత ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్రా ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతోమంది చిన్నారులకు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్లు చేయిస్తున్న విషయం తెలిసిందే.

మహేష్ కి ఇది కొత్త కాదు. గతంలో ఎందరికో మహేష్ ఇలా ఆపరేషన్లు చేయించి వారి ప్రాణాలు కాపాడాడు. పైగా ప్రతి ఏడాది మహేష్ వేలాది మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయిస్తునే ఉన్నాడు. అసలు మహేష్, చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించడానికి కారణం గతంలో చెప్పాడు. బాలయ్య ఆన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న మహేష్ తన సేవకు కారణం వివరించాడు.
ఇంతకీ మహేష్ ఏమి చెప్పాడంటే.. ‘తన కుమారుడు గౌతమ్ గురించి చెబుతూ మహేష్ ఎమోషనల్ అయ్యాడు. గౌతమ్ పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉన్నాడు. నా చేయి అంతే ఉన్నాడు. అప్పుడు మాకు డబ్బులు ఉన్నాయి, కాబట్టి సరిపోయింది. మరి డబ్బులు లేని వారి పరిస్థితి ఏమిటి ? అందుకే.. అప్పటి నుంచి చిన్నారుల కోసం ఏదైనా చేయాలని అనిపించింది.

అన్నట్టు మహేష్ గతంలో ‘బసవతారకం క్యాన్సర్ ఫౌండేషన్ కి కొంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని బుర్రిపాలెం, మరియు సిద్దాపురం అనే రెండు గ్రామాలను మహేష్ దత్తత తీసుకున్నాడు. ఆ గ్రామాల్లో మహేష్ ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టాడు. ఇంకా చేపడుతూనే ఉన్నాడు.
వైద్యో నారాయణో హరీ అన్నారు పెద్దలు. వైద్యుడిని దేవుడితో సమానం అని పోల్చి చెప్పిన పెద్దలు, వైద్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ మహేష్ లాంటి కొంతమంది దేవుళ్ళలానే సేవలు చేస్తున్నారు. కరోనా సమయంలో కూడా కరోనా బారిన పడి అల్లాడిపోతోన్న వారికి భరోసాగా నిలిచాడు మహేష్. ఎందర్నో ఆదుకున్నాడు.