కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రంగం సినీ పరీశ్రమ. అన్లాక్ తర్వాత మిగతా రంగాలు గాడిన పడుతున్నా.. చిత్ర పరిశ్రమ మాత్రం మరింత దిగాలు పడుతోంది. భాషతో సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది. థియేటర్స్ మూతపడ్డాయి. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. ప్రభుత్వం షూటింగ్స్కు అనుమతి ఇచ్చినప్పటికీ అనేక నిబంధనలు విధించింది. వాటిని పాటిస్తూ చిత్రీకరణ జరపడం ఫిల్మ్ మేకర్స్కు తలకు మించిన భారం అవుతోంది. సీరియల్ షూటింగ్స్ మొదలైనా సినిమాల విషయంలో మేకర్స్, స్టార్స్ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. కొందరు పెద్ద హీరోలైతే ఇప్పట్లో షూటింగ్ వచ్చేది లేదంటున్నారు. ఇంకొందరు ధైర్యం చేసి షూటింగ్ స్టార్ట్ చేసినా కరోనా భయంతో జూనియర్ ఆర్టిస్టులు షూటింగ్ కు రామని చెబుతున్నారు. ఇప్పటికే పలువురు టీవీ నటులు కరోనా బారిన పడడంతో వారిలో భయం మరింత పెరిగింది. దాంతో, ఈ నెలలో షూటింగ్ చేయాలనుకున్న వారు కూడా వెనుకడుగు వేస్తున్నారు . ఏదైతే అదైంది అని మరికొందరు మొండిగా ముందుకెళ్తున్నారు.
అయినా సరే యూనిట్లో ఎవరికైనా కరోనా సోకితే ఎలా అనే ఆలోచన వారి మదిని తొలిచేస్తోంది. హీరో లేదా హీరోయిన్ ఇతర ప్రధాన వ్యక్తులు కరోనా బారిన పడితే ఎలా? షూటింగ్ ఆగిపోతే ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఒకవేళ షూటింగ్ పూర్తయ్యాక రిలీజ్కు అవకాశం లేకపోతే ఎలా? అని ప్రశ్నలు వేసుకుంటున్నారు. అలాంటి వారందరికీ బాలీవుడ్ నిర్మాత ఒకరు దారి చూపించారు. ఈ భయాలకు పుల్స్టాప్ పెట్టిన ప్రశాంతంగా షూటింగ్ చేసుకోవాలంటే ఆ సినిమాకు కరోనా బీమా చేయించడమే ఉత్తమమని నిర్ణయానికి వచ్చేశారు. అంతేకాదు తాప్సీ హీరోయిన్గా తాను నిర్మిస్తున్న ‘లూప్ లపేటా’ మూవీకి కరోనా ఇన్సూరెన్స్ చేయించారు. ‘మా యూనిట్ సభ్యుల్లో ఎవరికి అయినా కరోనా ఎటాక్ అయితే షూటింగ్ నిలిపేయాల్సి వస్తే అప్పుడు మాకు వచ్చే నష్టంను భీమా సంస్థ చెల్లించాల్సి ఉంటుందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన అతుల్ చెబుతున్నారు. ఇలా కోవిడ్ ఇన్సూరెన్స్ చేయించి షూటింగ్ స్టార్ట్ చేయబోయే ఇండియా తొలి సినిమా ఇదే కానుంది. కరోనా సోకితే యూనిట్ సభ్యులందరూ హోం క్వారంటైన్లో ఉండాలి. చిత్రీకరణ ఆగితే ఆ నష్టాన్ని బీమాతో కవర్ చేసుకోవచ్చు. దాంతో, బాలీవుడ్లో ఇతర నిర్మాతలతో పాటు ఇతర భాషల మూవీ మేకర్స్ కూడా తమ సినిమాలకు కోవిడ్ ఇన్సూరెన్స్ చేయించుకోనే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే వారికి శ్రీరామరక్ష అవుతుంది.