Shivashankar Master Reign: కళ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన శివ శంకర్ మాస్టర్ లైఫ్ జర్నీ ఇదే ..!

Shivashankar Master Reign: కళ కోసం బతికాడు.. నాట్యాన్ని ప్రాణంగా ప్రేమించాడు. ఆ నాట్యంలోనే బతికాడు.. నటుడిగా మారాడు.. వినోదాన్ని పంచాడు.. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ముద్రవేశాడు. జాతీయ అవార్డును పొందాడు. కానీ చివరకు కరోనా ధాటికి నేలకొరిగాడు. తన ఒంట్లో శక్తి ఉన్నంత వరకూ పనిచేస్తానని.. నాట్యం చేస్తూనే చనిపోవాలన్న బలమైన ఆకాంక్ష ప్రముఖ కొరియోగ్రాఫర్, డ్యాన్స్ మాస్టర్ శివశంకర్ సొంతం. కరోనాతో పోరాడి కోలుకున్నా.. మృత్యువు ఆయనను కబళించింది. శివశంకర్ మాస్టార్ మరణం సినీ […]

Written By: NARESH, Updated On : December 3, 2021 12:09 pm
Follow us on

Shivashankar Master Reign: కళ కోసం బతికాడు.. నాట్యాన్ని ప్రాణంగా ప్రేమించాడు. ఆ నాట్యంలోనే బతికాడు.. నటుడిగా మారాడు.. వినోదాన్ని పంచాడు.. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ముద్రవేశాడు. జాతీయ అవార్డును పొందాడు. కానీ చివరకు కరోనా ధాటికి నేలకొరిగాడు. తన ఒంట్లో శక్తి ఉన్నంత వరకూ పనిచేస్తానని.. నాట్యం చేస్తూనే చనిపోవాలన్న బలమైన ఆకాంక్ష ప్రముఖ కొరియోగ్రాఫర్, డ్యాన్స్ మాస్టర్ శివశంకర్ సొంతం. కరోనాతో పోరాడి కోలుకున్నా.. మృత్యువు ఆయనను కబళించింది. శివశంకర్ మాస్టార్ మరణం సినీ ఇండస్ట్రీని విషాదంలో ముంచింది. కానీ ఆయన నాట్యం ఇంకా అందరి కళ్లముందు కదలాడుతూనే ఉంది.

siva-shanker-master

కరోనా కాటేసింది. దీనిదెబ్బకు ఇప్పటికే ఎస్పీ బాలు కన్నుమూయగా.. తాజాగా మరో సినీ దిగ్గజం నేలరాలిపోయారు. ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు శివశంకర్ మాస్టర్ ఇక లేరు. ఇటీవలే కరోనా బారినపడిన ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

-శివశంకర్ మాస్టర్ ప్రస్థానం

ఎన్టీఆర్ నుంచి ఏఎన్నార్ వరకూ.. నేటి చిరంజీవి, రాంచరణ్ ల వరకూ కూడా ఎన్నో సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ గా చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ (72) మరణం సినీ ఇండస్ట్రీని విషాదంలో ముంచింది. తెలుగు , తమిళం మొదలుకొని జపనీస్ లో కూడా పదికిపైగా భాషల్లో సినిమాలకు పనిచేసి అంత్యార్జాతీయ స్థాయిలో పేరొందిన ఒక నృత్య దర్శకుడు కరోనాకు బలి కావడం విషాదం నింపింది. తెలుగు సినిమా మగధీరలోని ‘ధీరధీర’ పాటకు ఉత్తమ నృత్యదర్శకుడిగా జాతీయ అవార్డును శివశంకర్ మాస్టర్ అందుకున్నారు. వేషధారణ, భాషలో ఎంతో ప్రత్యేకంగా కనిపించే శివశంకర్ మాస్టర్ దాదాపు 800పైగా చిత్రాల్లో పాటలకు కొరియోగ్రాఫర్ గా చేయడం గమనార్హం. తెలుగు, తమిళంలో 30కిపైగా సినిమాల్లో నటించి వినోదాన్ని అందించాడు. బుల్లితెరపై నటుడిగా, జడ్జిగా కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఎంతో మందిని చిత్రపరిశ్రమకు పరిచయం చేశాడు.

1948 డిసెంబర్ 7న చెన్నైలో కల్యాణ సుందర్, కోమల అమ్మాల్ దంపతులకు శివశంకర్ మాస్టర్ జన్మించాడు. ఈయనకు భార్య సుకన్య, కుమారులు విజయ్ , అజయ్ ఉన్నారు. కుమారులు ఇద్దరూ డ్యాన్స్ మాస్టర్లే. శివశంకర్ చిన్నప్పుడు జరిగిన ప్రమాదంలో వెన్నెముకకు తీవ్రగాయమైంది.దాంతో ఎనిమిదేళ్ల పాటు పడుకునే ఉన్నాడట.. విదేశాల నుంచి వచ్చిన నరసింహ అయ్యర్ అనే వైద్యుడి వల్ల శివశంకర్ కోలుకొని తిరిగి డ్యాన్సులపై దృష్టిపెట్టి ఎదిగాడు. 16వ ఏటే నృత్యం చేయడం మొదలుపెట్టారు.

శివశంకర్ మాస్టర్ 1975లో ‘పాట్టు భరతమమ్’ చిత్రానికి సహాయకుడిగా కెరీర్ ప్రారంభించారు. ‘కురువికూడు’ చిత్రంతో డ్యాన్స్ మాస్టర్ గా మారారు. కొరియోగ్రాఫర్ గానే కాదు.. నటుడిగా వెండితెరపై తనదైన ముద్రవేశాడు.

– శివశంకర్ మాస్టర్ తెలుగు, తమిళం సహా 10 భాషల్లో 800కు పైగా చిత్రాల్లో పాటలకు కొరియోగ్రాఫర్ గా చేశారు. అత్యధికంగా దక్షిణాది భాష చిత్రాలు పనిచేశారు.

-2003లో ‘అలయ్’ చిత్రంతో నటుడిగా మారారు. దాదాపు 30కిపైగా చిత్రాల్లో వైవిధ్యనటనతో నవ్వులు పంచారు.

శివశంకర్ మాస్టర్ అలనాటి నృత్యదర్శకుడు సలీమ్ వద్ద సహాయకుడిగా పనిచేసేవాడు. అప్పుడే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సినిమాలకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసేవాడు. నేటి హీరోలు రాంచరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలకు పనిచేశాడు. మగధీర, అరుంధతి సినిమాలకు నృత్యాలు సమకూర్చాడు. చిరంజీవి పాత ‘ఖైదీ’ సినిమాలోని ‘రగులుతోంది మొగలిపొద’ సినిమాకు శివశంకర్ మాస్టరే నృత్యాలు అందించడం విశేషం.

-బుల్లితెరపైన తనదైన ముద్రవేశారు. పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా చేశారు. ఈయన కింద శిష్యరికం చేసిన ఎంతో మంది కొరియోగ్రాఫర్ లు ఇప్పుడు దక్షిణాదిన టాప్ డ్యాన్స్ మాస్టర్ లుగా కొనసాగుతున్నారు.

Also Read: సాయం చేయలేని సానుభూతి వల్ల ఉపయోగం ఏముంది ?

శివశంకర్ మాస్టర్ కు ఇద్దరు కుమారులు విజయ్, అజయ్.. ఇద్దరూ డ్యాన్స్ మాస్టర్లే. వీరి ఫ్యామిలీ మొత్తం కరోనా బారినపడింది. భార్య, కుమారుడు క్వారంటైన్ లో ఉన్నారు. శివశంకర్ మాస్టర్ మృతితో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగింది. ఆయనకు సినీ ప్రముఖులంతా ఘన నివాళులర్పిస్తున్నారు.

ఇప్పటికే శివశంకర్ మాస్టర్ వైద్యఖర్చులకు డబ్బులు లేకపోతే తమిళ హీరో ధనుష్ రూ.10లక్షలు ఇచ్చారు. చిరంజీవి రూ.3 లక్షల ఆర్థికసాయం చేశారు. సోనూసూద్ సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇంత మంది చేసినా శివశంకర్ మాస్టర్ ప్రాణాలు దక్కలేదు. మాయదారి కరోనా ఆయనను తీసుకెళ్లిపోయింది. సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదాన్ని మిగిల్చింది.

Also Read: శివ శంకర్ మాస్టర్ జీవితంలో పెద్ద డ్రామానే ఉంది !