Naalu Pennungal: మనవన్నీ ” హీరో”చిత సినిమాలే. హీరోయిన్ కు మహా అయితే ఓ పది సీన్లు, నాలుగు లిప్ లాక్ లు, ఓ రెండు ఇంటిమేట్ సీన్స్. ఒకవేళ సినిమా తంతే.. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది హీరోయిన్నే. ఇలాంటి హీరో సెంట్రిక్ ఇండస్ట్రీలో నలుగురు హీరోయిన్లను పెట్టి సినిమా తీయొచ్చా? అది కూడా నవల ఆధారంగా? దాని ప్రకారం తీస్తే వర్క్ అవుట్ అవుద్దా? ఇప్పుడంటే ఓటీటీ రోజులు కాబట్టి ఇబ్బంది లేదు. ఇదే పని 15 ఏళ్ల క్రితం మాలీవుడ్ చేసింది. ఆ తర్వాతే తెలుగు లో అరుంధతి వచ్చింది. ఆ సినిమాకు దీనికి ఏమిటి అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టకండి. ఎందుకంటే త్రివిక్రమ్ ఓ సినిమాలో చెప్పినట్టు.. అద్భుతం జరిగినప్పుడు ఎవరూ పట్టించుకోరు. తర్వాత ఎవరూ గుర్తించరు. మాలీవుడ్ లో వచ్చిన ఈ సినిమా కూడా అంతే. పాత్ బ్రేక్ చేసి ఎన్నో హీరోయిన్ బేస్డ్ సినిమాలకు పాత్ ఇచ్చింది.

ఇలా మొదలైంది
కేరళకు చెందిన తగళి శివశంకర పిళ్లై మలయాళ సాహిత్యనిధి. వందల కథలు రాశారు. అందులో నుంచి నాలుగు కథలను మలయాళ ప్రసిద్ధ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్ ఎంపిక చేశారు. ఆ నాలుగు కథలను నాలుగు సినిమాలుగా తీయలేం! ఒకే సినిమాలో నాలుగు కథలు చూపించాలి. అందుకు తగ్గట్టు స్ర్కిప్ట్ రాసుకున్నారు. అది 2007 నాటి మాట. మలయాళ సినిమారంగంలో తొలి ఆంథాలజీకి అదే అంకురార్పణ అయి ఉండవచ్చు. ఇందులో ఏ కథకు ఆ కథ వేరుగానే ఉంటుంది. ఈ కథలన్నీ స్త్రీ జీవితాల చుట్టూ అల్లుకున్నవి. 1940 నుంచి 1960 మధ్య జరిగినవి. వాటిలో నటించేందుకు పద్మప్రియ, మంజు పిళ్లై, గీతూ మోహన్దాస్, కావ్య మాధవన్లను ఎంచుకున్నారు. మరొక ముఖ్యమైన పాత్ర ఉంది. నందితాదాస్ చేస్తే బాగుంటుంది. ఆదూర్ కేవలం 12 సినిమాలు తీసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన సినిమాల్లో దక్షిణాది హీరోయిన్లకే పెద్దపీట. రెండుసార్లు మాత్రం ఆ నియమం సడలింది. ‘విధేయన్’ సినిమా కోసం తన్వీ ఆజ్మీ, ఆ తర్వాత ‘నాలు పెన్నుంగల్’ కోసం నందితాదాస్. అంతే!
ఇంతకీ కథ ఏంటంటే
‘నాలు పెన్నుంగల్’ అంటే నలుగురు స్త్రీలు. ఈ కథలూ అలాగే ఉంటాయి. ఒకరు వేశ్య, ఒకరు గృహిణి, పెళ్లయినా సంసార జీవితం ఎరుగని మహిళ ఒకరు, వయసొచ్చినా పెళ్లి కాని స్త్రీ ఇంకొకరు. దక్షిణాది భాషల్లో వచ్చిన తొలి ఆంథాలజీ మూవీల్లో ఇదీ ఒకటి. 15 ఏళ్ల క్రితం విడుదలవడం వల్ల ఎక్కువ మందికి చేరలేదు. కానీ ఇవాళ ఓటీటీలో వచ్చి ఉంటే మరింత మందికి తెలిసి ఉండేది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు స్త్రీలు. వారికి సహాయంగా ఉండే పాత్రల్ని మనోజ్.కె.జయన్, ముఖేష్, శ్రీజిత్ రవి లాంటి వారు పోషించారు. నాలుగు భిన్న నేపథ్యాలు కలిగిన స్త్రీలు జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు కథలుగా మలిచిన విధానం చెప్పడం కన్నా చూడటమే బాగుంటుంది. ముఖ్యంగా కావ్య మాధవన్, నందితాదాస్ నటించిన కథ గుర్తుండిపోతుంది.

ఈ సినిమా చాన్నాళ్లు యూ ట్యూబ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉండేది. ఇప్పుడు అవి లేవు. ఈ సినిమా ఓటీటీలో ఉందో లేదో తెలియదు. దొరికితే మాత్రం తప్పకుండా చూడండి. దర్శకత్వం, నటనకు సంబంధించి భారతీయ సినీ పరిశ్రమలో ఒక క్లాసిక్. ఇక ఈ సినిమా చూసిన తర్వాతే కోడి రామకృష్ణ అరుంధతి సినిమా తీసేందుకు ముందుకు వెళ్లారు. ఈ సినిమాలో నలుగురు స్త్రీలు తమ జీవితంలో అనుభవించిన కష్టాలను, వాటిని ఎదుర్కొన్న తీరును తెరమీద చూపించారు. అలాగే అరుంధతి సినిమాలోనూ అనుష్క పాత్ర ను కూడా కష్టాలు ఎదుర్కొనే తీరుగా కోడి రామకృష్ణ చూపించారు. ఇండస్ట్రీ హిట్ సాధించారు.