Sonu Sood: కొద్దిరోజుల క్రితమే జెన్యు సంబంధిత ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న వరంగల్ కి చెందిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ పరిస్థితి ని చూసినప్పుడు మన హృదయం విచారం తో నిండిపోయింది. 17 ఏళ్ళ ఈ కుర్రాడు మరికొద్దిరోజుల్లోనే చనిపోతాడని డాక్టర్లు చెప్పడం , చివరి కోరికగా తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ని కలవాలని కోరిక ని ఆ కుర్రాడు వ్యక్తం చేయడం , ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే వరంగల్ కి వెళ్లి నిరంజన్ ని ఎంతో ఆప్యాయంగా పలకరించడం , అతను కోరిన పుడిల్ కుక్కని , ఐప్యాడ్ ని బహుమతిగా ఇవ్వడం తో పాటు , వైద్యానికి అవసరమయ్యే డబ్బులు ఇచ్చి , ఆ కుటుంబం చేత క్యాంటీన్ కూడా పెట్టించడం వంటివి కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను టచ్ చేసింది.
‘నా ఓజీ 2 మూవీ కి విశిష్ట అతిథి నువ్వే’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు కూడా బాగా వైరల్ అయ్యాయి. నిరంజన్ బ్రతికేందుకు ఒక్క శాతం అవకాశం ఉన్నా , దయచేసి అతన్ని బ్రతికించండి అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు , నెటిజెన్స్ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా ప్రార్తించారు. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా 5 లక్షల రూపాయిల ఆర్ధిక సాయం అందించారు. అయితే ఈ కుర్రాడు నిన్న రాత్రి కన్నుమూసిన సంఘటన తెలుసుకున్న అభిమానులు , నెటిజెన్స్ తీవ్రమైన దిగ్బ్రాంతి ని వ్యక్తం చేశారు. ఇంత తొందరగా చనిపోతాడని అసలు ఊహించలేదని , అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ పోస్టులు వేస్తున్నారు. ఇకపోతే ఆపదలో ఉన్నవారికి సహాయం అందించడంలో ఎప్పుడూ ముందు ఉండే వారిలో సోనూసూద్ ఒకరు అనే సంగతి అందరికీ తెలిసిందే. కరోనా లాక్ డౌన్ సమయం లో ఈయన అందించిన సేవలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు , అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు కూడా.
అయితే నిరంజన్ సమస్యని తెలుసుకున్న సోనూసూద్ పవన్ కళ్యాణ్ కంటే ముందే స్పందించారు. అతన్ని ఒకసారి కలిసి , అవసరమయ్యే డబ్బులు , వస్తువులు అన్నీ అందించారు. ఇప్పుడు నిరంజన్ చనిపోయాడు అనే విషయం తెలుసుకున్న సోనూసూద్ తీవ్రమైన విచారం వ్యక్తం చేశారు. వెంటనే కుటుంబానికి వీడియో కాల్ చేసి ఓదార్చారు. భవిష్యత్తులో కుటుంబానికి ఏ చిన్న అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని , భరోసా ఇచ్చారు. సోను సూద్ చూపించిన ఈ ఉదారంగా స్వభావాన్ని చూసి , పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
