యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఏకంగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ‘రాధేశ్యామ్’ రెడీఫర్ రిలీజ్ అంటోంది. కరోనా నేపథ్యంలో ఎప్పుడు వస్తుందో తెలియదుగానీ.. ప్రస్తుతానికైతే జులైలో స్లాట్ బుక్ చేశారు. ఆ సినిమా తర్వాత సలార్, ఆదిపురుష్ మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ స్టార్ట్ కావాల్సి ఉంది.
అయితే.. ఇందులో ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘ఆదిపురుష్’. ఇండియన్ తెరపై శ్రీరాముడు కనిపించక చాలా కాలమైంది. ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండడంతో.. ఈ సినిమా ఎలా ఉంటుందోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దీంతో.. అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
అయితే.. కొన్ని రోజులుగా ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కరోనా కారణంగా.. సినిమా చిత్రీకరణ వాయిదా వేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయం అటూ ఇటూ తిరిగి యూనిట్ వరకు వెళ్లడంతో.. దర్శకుడు ఓం రౌత్ ఎంట్రీ ఇచ్చారు.
కరోనా నేపథ్యంలో షూటింగ్ నిలిచిపోయిందనే వార్తలు అవాస్తవాలని కొట్టిపారేశారు. ఇప్పటి వరకూ ‘ఆదిపురుష్’ చిత్ర యూనిట్ లో ఎవ్వరికీ కరోనా రాలేదని చెప్పారు. యూనిట్లో కొందరికి కొవిడ్ పాజిటివ్ వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు ఓం రౌత్.
దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తెరకెక్కుతోంది ఆదిపురుష్. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్ కనిపించనుండగా.. కృతిసనన్ సీత పాత్ర పోషిస్తోంది. ప్రత్యర్థి రావణుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.