Megastar Chiranjeevi: కరోనా సోకడంతో శివ శంకర్ మాస్టర్ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో రోజుకు లక్ష రూపాయలకు పైగా చిలిత్సకు ఖర్చు అవుతుందని తెలుస్తుంది. కాగా తమ దగ్గర అంత డబ్బు లేదని, ఆర్ధిక సాయం చేసే దాతల కోసం ఎదురు చూస్తున్నామని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు అజయ్కు ఫోన్ చేసి ఆయన్ను ఇంటికి పిలిపించుకున్నారు.
తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కును అజయ్ కు అందజేశారు. ప్రస్తుతం శివ శంకర్ మాస్టర్ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ‘మేమంతా ఉన్నాం’ అని చెప్పి అజయ్కు అభయం ఇచ్చారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ “చిరంజీవి గారు అంటే నాన్నగారికి ఎంతో అభిమానం. వాళ్లిద్దరూ కొన్ని సినిమాలకు కలిసి పని చేశారు. ఇటీవల ‘ఆచార్య’ షూటింగులోనూ చిరంజీవి గారిని నాన్న కలిశారు. ప్రస్తుతం మేం ఉన్న పరిస్థితిల్లో మాకు ప్రతి రూపాయి చాలా అవసరం. ఇప్పుడు చిరంజీవి గారు చేసిన సాయం ఎన్నటికీ మరువలేం. ఆయనకు ఎన్నటికీ రుణపడి ఉంటాను” అని అన్నారు.
ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఎ.ఐ.జి ఆస్పత్రిలోని క్రిటికల్ కేర్లో వెంటిలేటర్ మీద శివ శంకర్ మాస్టర్ చికిత్స పొందుతున్నారు. ఆయన భార్య క్వారంటైన్లో ఉన్నారు. పెద్ద కుమారుడు సైతం వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి స్సయమ్ చేస్తామని సోనూ సూద్, ధనుష్, మంచు విష్ణు ముందుకొచ్చారు. మరికొంత మంది ప్రముఖులు సైతం సాయం చేసేందుకు స్పందిస్తున్నారు.