![]()
అవి ‘నారీ నారీ నడుమ మురారీ’ సినిమా షూటింగ్ మొదలవుతున్న రోజులు. సినిమా మొత్తం గ్రామీణ వాతావరణంలో జరుగుతుంది. కానీ, సినిమాని మద్రాసులోనే షూట్ చేయాల్సిన పరిస్థితి నిర్మాతది. మరి ఏమి చేయాలి ? అసలుకే ఈ సినిమాని యువచిత్ర సంస్థ నిర్మిస్తోంది. కథాబలం కలిగిన చిత్రాలను మాత్రమే ఆ సంస్థ నిర్మిస్తోంది. పైగా ఈ సంస్థ అధినేత మురారి. ప్రేక్షకుల్లో మంచి నిర్మాత అని గుర్తింపు కలిగిన నిర్మాత ‘మురారి’.
అందుకే మురారి అడగ్గానే బాలయ్య కూడా సినిమా చేయడానికి వెంటనే డేట్లు ఇచ్చాడు. కానీ వేరే సినిమాల షూట్ కారణంగా షూటింగ్ మద్రాసులోనే పెట్టుకుందాం అని బాలయ్య రిక్వెస్ట్ చేశాడు. సరే, కొన్ని రోజుల తర్వాత బాలయ్యను ఒప్పిద్దాం అంటే.. అది జరిగే పని కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో బాలకృష్ణ డేట్స్ నిర్మాత దేవీ వరప్రసాద్ చూసేవాడు.
బాలయ్య ఒప్పుకున్నా… దేవి వరప్రసాద్ ఒప్పుకోడు. అసలుకే కథ ఎంపిక చేసే బాధ్యత కూడా మురారినే తీసుకున్నారు. ఈ విషయంలోనే దేవీ వరప్రసాద్ ఫీల్ అయ్యారు. అందుకే ఇప్పుడు షూటింగ్ కూడా మురారి తనకు నచ్చిన ప్లేస్ లో పెడితే.. అసలుకే మోసం వస్తోంది. కాబట్టి మద్రాసులోనే షూట్ చేయాలి. దాని కోసం మద్రాసు చుట్టుపక్కల అంతా వెతికారు. కాకపోతే కరెక్ట్ లొకేషన్ దొరకలేదు.
కానీ, మద్రాసులోని వేలచ్చేరి ప్రాంతంలో ఒక గెస్ట్ హౌస్ బాగుంది. సినిమా మొత్తం అక్కడే షూట్ చేసేసుకోవచ్చు. మరి ఆ గెస్ట్ హౌస్ షూటింగ్ ఇస్తారా ? అని ఆరా తీస్తే.. ఆ గెస్ట్ హౌస్ చిరంజీవిది అని తేలింది .ఆ గెస్ట్ హౌస్ కి చిరంజీవి పెట్టుకున్న పేరు ‘హనీ హౌస్’. నిజానికి తన ఓన్ సినిమాల షూటింగ్ కి కూడా చిరు తన గెస్ట్ హౌస్ ను ఇవ్వడానికి ఇష్టపడలేదు.
అయితే, బాలయ్య సినిమాకి తన గెస్ట్ హౌస్ కావాలని ఎవరి ద్వారో చిరుకు తెలిసింది. వెంటనే చిరు, బాలయ్యకి ఫోన్ చేశారు. మీ సినిమా కాబట్టి, మా గెస్ట్ హౌస్ ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ చిరు నవ్వుతూ అన్నాడు. అంతే.. మరుసటి రోజు ‘హానీ హౌస్’లో బాలయ్య సినిమా షూటింగ్ మొదలైంది. ఆ సినిమా ఎంత గొప్ప హిట్ అయిందో అందరికీ తెలిసిందే.