Allu Arjun Visits Shankarpally MRO Office: సినిమా సెలబ్రిటీ మీ ప్రాంతంలోకి సాధారణ వ్యక్తిలాగా వస్తే ఎలా ఉంటుంది, సరిగ్గా అలాంటి అనుభూతే శంకర్పల్లిలోని ఎమ్మార్వో కార్యాలయంలో జరిగింది. టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్ పుష్ప షూటింగ్తో బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు ఆయన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి తశీల్దార్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. మండలంలోని జన్వాడ గ్రామంలో రెండెకరాల భూమిని బన్నీ ఇటీవల కొనుగోలు చేశారు. కాగా, ఆ భూమి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులకై ఈరోజు ఉదయం ఆయన శంకర్పల్లి ఎమ్మార్వో ఆఫీస్కు వెళ్లారు.
ప్రకృతి ప్రేమికుడైన బన్నీ ఈ భూమిని వ్యవసాయ క్షేత్రంగా మార్చి, తీరిక సమయాల్లో కుటుంబంతో కాలక్షేపం చేయడం కోసం కొన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ రాకతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. కార్యాలయంలోని ఉద్యోగులు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. మరోవైపు, బన్నీ రాక గురించి తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో తహశీల్దార్ ఆఫీస్ వద్దకు తరలివచ్చారు. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ పనులు పూర్తైన వెంటనే కొంతమందితో ఫొటోలు దిగిన ఆయన మళ్లీ హైదరాబాద్కు వచ్చేశారు. మరోవైపు జూలై నెలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా శంకర్పల్లి మండల పరిధిలో ఆరున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే.