
BRS- Congress: టీపీసీసీ అధ్యక్షుడు వలస వాది అని, ఆయన నాయకత్వంలో పని చేయలేమని, తాము అసలైన కాంగ్రెస్ వాదులమని రేవంత్రెడ్డిపై తిరుగు బావుటా ఎగురవేసిన ఆ పార్టీ సీనియర్ నాయకులు.. ఇప్పుడు పొత్తుల కోసం పాకులాడుతున్నారు. బరిలో దిగక ముందే ఓడిపోతామన్నట్లు.. ఒంటిగా పోటీ చేస్తే గెలవడం సాధ్యం కాదని డిసైడైనట్లున్నారు. పోటీకి ముందే ఓటమిని అంగీకరించినట్లుగా వ్యవహరిస్తున్నారు. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందని ప్రకటించగా, తాజాగా మరో సీనియర్ నేత జానారెడ్డి కూడా పొత్తుపై కొత్త ముచ్చట చెప్పారు.
శత్రువులు ఎక్కడో లేరు..
‘శత్రువులు ఎక్కడో ఉండర్రా.. అక్క, కూతురు, ఆడ పడచు రూపంలో మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు’ ఇది ఓ సినిమాలో రావు రమేశ్ చెప్పిన డైలాగ్. ఈ డైలాగ్ తెలంగాణ కాంగ్రెస్కు అచ్చంగా సరిపోతుంది. కాంగ్రెస్ను ఓడించడానికి ప్రత్యేర్థులు పనిగట్టుకుని రావాల్సిన పనిలేదు. పార్టీ నుంచే పుట్టుకొస్తారు. ఈ విషయం సీఎం కేసీఆర్ పసిగట్టారు. అందుకే కాంగ్రెస్ తమకు శత్రువే కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకుంటోంది అనుకుంటున్న సమయంలో సీనియర్లు తెరపైకి వచ్చేస్తారు. బీఆర్ఎస్తో పొత్తుల గురించి మాట్లాడేస్తారు. అసలు పోరాడుతోంది బీఆర్ఎస్తో అయితే కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారెవరైనా ఆ పార్టీతో పొత్తుల గురించి మాట్లాడరు. కానీ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు మాట్లాడతారు.
కాంగ్రెస్ గెలవాలా.. బీఆర్ఎస్ గెలవాలా..
తెలంగాణలో బీఆర్ఎస్పై పోరాడుతున్నామని ఒకసారి అంటారు. ఇంకోసారి బీఆర్ఎస్తో కలిసి పనిచేద్దాం అంటారు.. ఇంతకి వారికి కావాల్సింది కాంగ్రెస్ గెలవడమా.. బీఆర్ఎస్ గెలవడమా అన్నది సీక్రెట్గానే ఉంచుతారు. వీలైనంత కాంగ్రెస్ను డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేస్తారు. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన జానారెడ్డి తప్పదనుకుంటే బీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని ప్రకటించేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలసి పని చేస్తామని చెప్పారు.

రాహుల్కు అండగా నిలిచిందని..
బీఆర్ఎస్తో పొత్తుకు జానారెడ్డి కొత్త కారణం కూడా వెతుక్కున్నారు. బీఆర్ఎస్ కూడా ఇప్పటికే రాహుల్ గాంధీకి అండగా నిలిచిందని.. అదే పొత్తుకు ప్రాతిపదిక అన్నట్లుగా మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తులు ఉండే అవకాశం ఉందని.. పెట్టుకోక తప్పదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో ఓ సారి చేసిన వ్యాఖ్యలపై నేతలు భగ్గుమన్నారు. తర్వాత అది సద్దుమణిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కోరుకుంటున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే రేవంత్రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్తో కలిసే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఒంటరిగానే అధికారంలోకి వస్తామని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సీనియర్లు మాత్రం భిన్నమైన రాజకీయంతో వెళ్తున్నారు. ఇది కాంగ్రెస్లో కొత్త అలజడికి కారణం అవుతోంది.
పోరాటం చేయాల్సిన పార్టీతోనే పొత్తులని ప్రచారం చేసుకుంటే మొదటికే మోసం వస్తుందని తెలిసినా సీనియర్లు తగ్గడం లేదు. వాళ్లకు కాంగ్రెస్ గెలుపుకంటే.. బీఆర్ఎస్ను గెలిపంచాలన్న ఆత్రుతే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.