సినిమా ఇండస్ట్రీ అంటే ఓ రంగుల ప్రపంచం. దూరం నుంచి చూస్తున్న వారంతా అదో అద్భుత లోకంగా భావిస్తారు. భారీ పారితోషికాల కారణంగానే ఈ విధంగా చూస్తుంటారు సాధారణ జనం. కానీ.. ఎక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉంటాయి. అవకాశాలు రావడం ఒకెత్తయితే.. వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఎగ్గొట్టే ఘటనలు కో కొల్లలు. ఇదే కోవలో తాను రూ.50 లక్షల మేర మోసపోయినట్టు చెప్పారు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్.
మొదట్లో సీరియల్ నటుడిగా ఉన్న సమీర్.. ఆ తర్వాత సినిమాల్లోనూ తనదైన సత్తా చాటారు. ఇలాంటి సమీర్ తన వ్యక్తిగత జీవితంతోపాటు వృత్తిగత జీవనాన్ని కూడా వివరించారు. తన తల్లి బ్రాహ్మిణ్ అని చెప్పిన సమీర్.. తండ్రి ముస్లిం అని తెలిపారు. ఇక, తనకు అర్థం చేసుకునే భార్య దొరికిందని, తనను ఎంతగానో ప్రేమిస్తుందని చెప్పారు.
ఇదేవిధంగా.. తన వ్యక్తిగత అలవాట్లు కూడా తెలియజేశారు. తనకు పొగ తాగే అలవాటు ఉందని చెప్పారు సమీర్. దాంతోపాటు సందర్భానుసారం లిక్కర్ కూడా తీసుకుంటానని తెలిపారు. సినీ పరిశ్రమలో అందరితోనూ కలిసిపోతానని, చాలా మంది స్నేహితులు ఉన్నారని చెప్పారు. తాను నటించిన సీరియల్స్ లో శాంతి నివాసం చాలా మంచి పేరు తెచ్చిందని తెలిపారు. ఆ సీరియల్ ను తెరకెక్కించిన రాజమౌళితో ఉన్న పరిచయం కారణంగా.. ఆయన చేసిన పలు చిత్రాల్లో అవకాశం వచ్చినట్టు చెప్పారు. శ్రీరామదాసు చిత్రంలో తాను పోషించిన లక్ష్మణుడి పాత్ర కోసం ఎంతో హోమ్ వర్క్ చేసినట్టు చెప్పారు సమీర్.
అయితే.. సినిమా పరిశ్రమ గురించి ఎన్ని చెప్పుకున్నా.. అదొక బిజినెస్. అందువల్ల ఎన్నో ఆటుపోట్లు తలెత్తుతుంటాయి. కొన్ని సినిమాలు పూర్తయిన తర్వాత కూడా రావాల్సిన రెమ్యునరేషన్ రాదు. తన విషయంలోనూ ఇది జరిగిందని చెప్పారు సమీర్. తనకు కొంత మంది పారితోషికం ఇవ్వలేదని తెలిపారు. దాదాపు సినిమా ఇండస్ట్రీ నుంచి తనకు 50 లక్షలు రావాల్సి ఉందని, అంత మొత్తం తనకు దక్కలేదని చెప్పారు సమీర్. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తున్నాని, మరికొన్ని చర్చల దశలో ఉన్నాయని చెప్పారు.