Vizianagaram: ప్రేమజంటకు బెదిరింపు.. పారిపోయిన ప్రియుడు.. ప్రియురాలిపై లైంగిక దాడి..హోంగార్డు చేసిన దారుణాలు ఇవి.

విజయనగరంలో జిల్లాలోని నెల్లిమర్ల మండలంలో ఓ జంట చాలా కాలంగా ప్రేమించుకుంటోంది. అయితే బొండ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడకరకం అనేగ గ్రామంలో రోడ్డుకు సమీపంలో ఓ జంట కూర్చుని ఉంది.

Written By: Chai Muchhata, Updated On : August 1, 2024 11:34 am

Vizianagaram

Follow us on

Vizianagaram: వాళ్లు ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. సరదాగా కాసేపు మాట్లాడుకుందామని ఒక చోట కలిసి కూర్చున్నారు … కానీ అంతలోపే అక్కడికి ఓ హోంగార్డ్ వచ్చి వారిని బెదిరించారు.. ఆ తరువాత కేసులు పెడుతామని అనడంతో ప్రియుడు అక్కడితో పారిపోయాడు.. ఇదే అదనుగా భావించిన హోంగార్డు ఆ యువతిపై లైంగిక వేధింపులకు గురిచేసిన సంఘటన కలకలం సృష్టించింది… ఏపీలో అమ్మాయిలపై ఆకృత్యాలు ఆగడం లేదు.. ఆడవాళ్లపై లైంగిక వేధింపుల వార్త రోజుకోటి వినాల్సి వస్తోందని కొందరు మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆడవాళ్ల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. అమాయకులైన కొందరు యువతులను బెదిరించి, మభ్య పెట్టి వారిపై ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.ఆపద సమయంలో వచ్చి ఆదుకోవాల్సిన కొందరు పోలీసు రంగానికి చెందిన వారు సైతం కంటిపాపే కాటేసినట్లుగా వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో జరిగిన సంఘటనను చూసి కొందరు లవర్స్ షాక్ అవుతున్నారు. ప్రేమించుకొని సరదాగా ఉండేందుకు పార్క్ కు వెళ్లిన జంటపై ఓ హోం గార్డు చేసిన పనికి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. సరదాగా ఉండే స్వేచ్ఛ లేదా అని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ ఘటనలో సదరు హోం గార్డును పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ అమ్మాయిల విషయంలో ఎక్కడ తప్పు జరిగినా క్షమించేది లేదని చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

విజయనగరంలో జిల్లాలోని నెల్లిమర్ల మండలంలో ఓ జంట చాలా కాలంగా ప్రేమించుకుంటోంది. అయితే బొండ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడకరకం అనేగ గ్రామంలో రోడ్డుకు సమీపంలో ఓ జంట కూర్చుని ఉంది. ఇదే సమయంలో మంగళవారం సాయంత్రం బొండ్లపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హోంగార్డు సురేష్ ఇంటికి బయలు దేరాడు. దారిలో ఈ జంటను చూసిన సురేష్ ఆ జంట వద్దకు వెళ్లాడు.. ఆ తరువాత వారిని బెదిరింపులకు గురిచేశాడు. తాను ఎస్ ఐనని, ఇక్కడ ఉంటే కేసు పెడుతానని బెదరించాడు. దీంతో భయంతో ప్రియుడు అక్కడి నుంచి పారిపోయాడు.

ఆ తరువాత యువతిని బైక్ పై ఎక్కించుకొని రామతీర్థం సమీపంలో ఉన్న చంపానది ఒడ్డున ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ యువతిని లోబర్చుకున్నాడు. ఈ విషయంపై ఎవరికైనా చెప్పొద్దని వార్నింగ్ఇచ్చాడు. అయితే ఆ తరువాత బాధితురాలు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో హోంగార్డుపై కేసు నమోదు చేశారు. ఆ తరువాత అరెస్టు చేశారు. ఈ కేసు రుజువైతే హోంగార్డును శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తామని స్థానిక ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.

అయితే ఏకాంతంగా ఉన్న జంట వద్దకు వెళ్లిన హోంగార్డు పై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రేమికులు సరదాగా ఉండే స్వేచ్ఛ లేదా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. తప్పు చేస్తే దండించాల్సిన వ్యవస్థకు చెందిన హోంగార్డు ఇలాంటి పనులు చేయడం సమంజసం కాదని అంటున్నారు. ఏపీలో రోజురోజుకు ఆడవారిపై జరుగుతున్న లైంగిక వేధింపులతో చాలా మంది మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బాధితురాలు తనకు జరిగిన నష్టంపై కుంగిపోకుండా ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొనియాడుతున్నారు. ప్రతీ ఒక్కరూ తమకు జరిగిన అన్యాయంపై ఎదరించాలని అంటున్నారు. అంతేకాకుండా లైంగిక వేధింపుల విషయంలో ఎంతటి వారైనా భయపడకుండా వారిపై ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. అప్పుడే మిగతా వారికి భయం ఉంటుందని అంటున్నారు.