Crime News : కారణాలేమైనా గానీ.. సంసారాలు ఒకప్పటి లాగా సాగడం లేదు.. “పతీ, పత్నీ, ఔర్ వో”!

సరిగ్గా ఏడాది క్రితం తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముదిగొండ మండలంలోని ఓ గ్రామంలో ఓ వివాహిత వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ఆమెకు ఇద్దరు కూతుర్లు. వారికి పెళ్లిళ్లయ్యాయి. పిల్లలు కూడా కలిగారు. అయినప్పటికీ ఆమె తన సంబంధాన్ని మర్చిపోలేదు. పైగా తమకు అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 1, 2024 8:31 pm

Crime News

Follow us on

Crime News :  ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నప్పటికీ.. ఆ వివాహిత తన ప్రియుడితో కలిసి తన భర్తను మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపించింది. ఒక్క ఆధారం కూడా బయటకు లభించకుండా జాగ్రత్త పడింది. అయితే పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఈ కేసును చేదించారు.. పోలీసులకు కేసు పరిష్కారంలో సెల్ ఫోన్ సిగ్నల్ సహకరించింది. ఆ ఘటనను మర్చిపోకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కడప జిల్లా వేముల మండలం వి కొత్తపల్లె అనే గ్రామంలో మరో దారుణం జరిగింది. ఈ గ్రామానికి చెందిన ఎలంకూరు నరసింహులు (49) వీఆర్వో గా పని చేస్తున్నారు. ఆయన భార్య పేరు సుబ్బలక్షుమ్మ. నరసింహులు ఆర్జనకు తోడుగా తాను కూడా ఎంతో కొంత సంపాదించాలి అనే ఉద్దేశంతో సుబ్బలక్షుమ్మ ముగ్గురాయి పనులకు వెళ్ళేది. అయితే ఇదే క్రమంలో ఆమెకు బాబు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరిద్దరి వ్యవహారం నాలుగు నెలల క్రితం నరసింహులుకు తెలిసింది. ఆ సమయంలో బాబుతో అతడు గొడవపడ్డాడు. సుబ్బలక్షుమ్మ కొద్దిరోజులపాటు తల్లిగారింటికి వెళ్లి వచ్చింది. పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగిన అనంతరం ఆమె తిరిగి తన భర్త దగ్గరికి వచ్చింది.

వరండాలో పడుకొని ఉండగా..

భర్త దగ్గరికి తిరిగి వచ్చినప్పటికీ బాబుతో సంబంధాన్ని సుబ్బలక్షుమ్మ కొనసాగిస్తూనే ఉంది. అయితే తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి నరసింహులును చంపాలని సుబ్బలక్షుమ్మ, బాబు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా దుర్మార్గమైన ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ముగ్గు రాయి గనులలో డిటోనేటర్లు వాడుతుంటారు. జిలెటిన్ స్టిక్స్ ఉపయోగిస్తుంటారు. వాటిని పేల్చి వేయడంలో బాబుకు విశేషమైన అనుభవం ఉంది. వాటి ద్వారానే నరసింహులు హత్యకు ప్రణాళికను రూపొందించాడు. ఇటీవల ఆదివారం రాత్రి నరసింహులు తన భార్యతో వేరు వేరు మంచాలలో వరండాలో పడుకున్నారు. ఇదే సమయంలో బాబు నరసింహులు పడుకున్న మంచం కింద డిటోనేటర్, జిలెటిన్ స్టిక్స్ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వాటిని పేల్చాడు. వాటి పేలుడు తీవ్రతకు నరసింహులు, సుబ్బలక్షుమ్మ తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో నరసింహులు ను 108 లో వేంపల్లె కు తీసుకువెళ్తుండగా మధ్యలోనే కన్నుమూశాడు..సుబ్బలక్షుమ్మ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వివాహేతర సంబంధం విషయంలో ఒక వ్యక్తిని చంపడానికి ఇలాంటి మందు గుండు సామగ్రి వాడటం ఇదే తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే చర్చ నడుస్తుంది. ఆ తర్వాత షరా మాములైపోతుంది. సోషల్ మీడియా, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, వ్యక్తిగత స్వేచ్ఛ పెరగడం.. కారణాలు ఏవైనా గానీ.. ఒకప్పటిలాగా సంసారాలు సాగడం లేదనేది యదార్ధం.