SBI Cyber Scam: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. ఇప్పటికే రివార్డ్ పాయింట్లు, KYC అప్డేట్, బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందంటూ ప్రజలను మోసం చేస్తున్న వీరు.. ఇప్పుడు SBI YONO యాప్ను వెంటనే అప్డేట్ చేయకపోతే మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బు ప్రమాదంలో పడుతుందని భయపెడుతూ ఫేక్ సందేశాలు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని SBI అధికారికంగా హెచ్చరించింది. ఈ మోసం ఎలా ఉంటుందంటే?
సైబర్ నేరగాళ్లు SMSలు, వాట్సాప్ సందేశాలు లేదా ఈ-మెయిల్స్ ద్వారా ‘YONO యాప్ను వెంటనే అప్డేట్ చేయండి’ అంటూ ఓ లింక్ పంపిస్తున్నారు. ఆ లింక్పై క్లిక్ చేస్తే అధికారిక యాప్ కాకుండా ఫేక్ APK ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. దానిని మొబైల్లో ఇన్స్టాల్ చేసిన వెంటనే ఫోన్లోని వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, OTPలు, పాస్వర్డ్లు వంటి సున్నితమైన డేటా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. అనంతరం బాధితుల బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బును దోచేస్తున్నారు.
ఈ తరహా మోసాలపై స్పందించిన SBI.. YONO యాప్ను ఎప్పుడూ అధికారిక Google Play Store లేదా Apple App Store నుంచే అప్డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. SMSలు, వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా వచ్చే APK ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేయవద్దని, తెలియని లింక్లపై క్లిక్ చేయవద్దని సూచించింది. బ్యాంకు ఎప్పుడూ ఈ విధంగా APK ఫైల్స్ పంపదని కూడా వెల్లడించింది.
ఖాతాదారులు తమ బ్యాంకింగ్ వివరాలు, OTP, CVV, PIN, పాస్వర్డ్ వంటి గోప్య సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని SBI సూచిస్తోంది. అనుమానాస్పద సందేశాలు, కాల్స్ లేదా లింకులు ఎదురైతే వెంటనే వాటిని విస్మరించి, బ్యాంకును సంప్రదించాలని తెలిపింది.
ఒకవేళ ఇటువంటి సైబర్ మోసానికి గురైనట్లయితే లేదా అనుమానాస్పద లావాదేవీలు గమనించినట్లయితే వెంటనే జాతీయ సైబర్ హెల్ప్లైన్ 1930కు కాల్ చేయాలని, అలాగే సమీపంలోని SBI శాఖను సంప్రదించాలని బ్యాంక్ సూచించింది. అదనంగా, జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. కొద్దిపాటి అప్రమత్తతతోనే ఇటువంటి సైబర్ మోసాల నుంచి తమ డబ్బును, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
