Khammam Cyber Fraud: కష్టపడితే అప్పటికప్పుడే ఫలితాలు రాకపోవచ్చు గాని.. ఎప్పటికైనా సరే ఆ ఫలితం దక్కుతుంది. స్థూలంగా చెప్పాలంటే కష్టపడితేనే ఫలితం లభిస్తుంది. అది జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది. నేటి కాలంలో చాలామంది కష్టపడకుండానే ఫలితాలు రావాలని కోరుకుంటున్నారు. చెమట చుక్క చిందించకుండానే రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని భావిస్తున్నారు. దీనికోసం అనేక రకాలైన అడ్డదారులు తొక్కుతున్నారు. సక్రమమైన మార్గంలో వెళ్తే ఎవరైనా సరే రాజా లాగా బతుకు వచ్చు. అడ్డదారిలో వెళ్తే దొరికిపోతారు. చివరికి కటకటాల వెనక్కి వెళ్తారు.
Also Read: అక్కా.. కేసులు వెనక్కి తీసుకో.. పాపం రేవంత్ రెడ్డిది మామూలు బాధ కాదు పో..
ఇంతకీ ఏం జరిగిందంటే
మోసపోయేవాడు ఉంటే.. మోసం చేసేవాడు కూడా ఉంటాడు. ఇప్పటి కాలంలో మోసాలు వేరే విధంగా సాగుతున్నాయి. మాయ మాటలు.. రకరకాల స్కీముల ఆధారంగా సాగుతున్నాయి. ఈ మోసాలకు కేంద్ర బిందువు డబ్బు కాబట్టి.. డబ్బు ఆధారంగానే ఇవన్నీ సాగుతున్నాయి. కష్టపడకుండానే డబ్బు సంపాదించవచ్చని.. రూపాయి పెట్టుబడి పెడితే వంద రూపాయలు లాభం వస్తుందని చెబితే.. ఎవరైనా సరే నమ్ముతున్నారు. ఆ మాయమాటలను విశ్వసించి పెట్టుబడులు పెడుతున్నారు. చివరికి నిండా మునిగిపోయి.. చేతులు కాల్చుకుంటున్నారు. అటువంటిదే ఈ ఘటన కూడా.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ సంఘటన సైబర్ నేరాల తీవ్రతను తేట తెల్లం చేస్తోంది. ఓ వ్యాపారికి వాట్సాప్ లో సైబర్ నేరగాళ్లు పరిచయమయ్యారు. రూపాయి పెట్టుబడి పడితే ₹100 లాభం వస్తుందని చెప్పారు. దీనికోసం రకరకాల ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. మొదట్లో అతడు నమ్మలేదు. అయితే వాళ్లు అతడికి బుట్టలో వేసుకోవడానికి.. కొంత నగదు అతడి దగ్గర నుంచి తీసుకున్నారు. ఓ కంపెనీలో పెట్టుబడి పెట్టించారు. అతడు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే.. దాదాపు పది లక్షల వరకు లాభం వచ్చింది. దీంతో అతడికి నమ్మకం కుదిరింది.
ఇలా వారు చెప్పినట్టుగా రకరకాల ఖాతాలలో రెండు కోట్ల వరకు వేశాడు. సైబర్ నేరస్తులు చెప్పిన ఆ కంపెనీ పేరు ఎఫ్ ఎక్స్ ప్రో.. అందులో రెండు కోట్ల వరకు పెట్టుబడి పెట్టిన ఆ వ్యాపారి.. ఇతరులకు కూడా చెప్పాడు.. దాంతో వారు కూడా పెట్టుబడులు పెట్టారు. కోట్లలో నగదు జమైన తర్వాత సైబర్ నేరగాళ్లు ఫోన్ ఎత్తడం మానేశారు. దీంతో వారికి అనుమానం వచ్చింది. జరిగిన వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఖాతాలో జమ చేసిన నగదు.. ఫోన్ నెంబర్లు.. జరిపిన సంప్రదింపులు.. ట్రేడింగ్.. ఇతర వ్యవహారాలను పరిశీలించారు. ఇది భారీ ఎత్తున జరిగిన సైబర్ నేరమని గుర్తించారు. ఆ తర్వాత సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందిన మహమ్మద్ సాదిక్.. శ్యాంబాబు అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి ఖాతాలలో 7 లక్షల వరకు నగదు ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు వారు.. నగదును రకరకాల ఖాతాలకు పంపించడానికి ప్రయత్నం చేసినట్టు సమాచారం.