Cyber Crime Funds: చేతికి మట్టి అంటకూడదు. ఒంటికి చెమట పట్టకూడదు. ఒళ్ళు అసలు వంచకూడదు. కానీ కోట్లకు కోట్లు ఖాతాలో జమ కావాలి. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలి. ఆగర్బ శ్రీమంతులుగా రాత్రికి రాత్రే మారిపోవాలి. కాలు కింద పెడితే కందిపోకుండా ఎర్ర తివాచీ ఉండాలి. ఇవన్నీ జరగాలంటే అద్భుతాలు చోటుచేసుకోవాలి.
కొంతమంది ఇలాంటి అద్భుతాలను చేసి చూపిస్తున్నారు. కాకపోతే సక్రమమైన పనులతో కాదు.. పూర్తిగా అక్రమమైన వ్యవహారాలతో. మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాడు కూడా ఉంటాడు అన్నట్టుగా.. సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని అడ్డం పెట్టుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఫేక్ కాల్స్ చేయడం.. మోసపూరితమైన లింకులు పంపించడం.. ఇంకా రకరకాల వ్యవహారాల ద్వారా కోట్లు గడిస్తున్నారు. వీటిని వైట్ కాలర్ మోసాలు అంటారు కాబట్టి.. నష్టం జరిగిన తర్వాత చాలా రోజులకు గాని బయటపడదు. మనదేశంలో సైబర్ నేరాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా ఆన్ లైన్ లో మోసాలకు పాల్పడి నేరగాళ్లు దాదాపు 34,855 కోట్లు కొట్టేశారు. ఇదంతా కూడా ఈడి దర్యాప్తులో తేలింది.
34, 855 కోట్ల డబ్బులో 12,230 కోట్లను ఈడి అటాచ్ చేసింది. సైబర్ నేరాల పై దాదాపు 234 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నట్టు ఈడి అధికారులు చెబుతున్నారు.. ఆన్ లైన్ గేమింగ్.. క్రిప్టో కరెన్సీ.. లోన్ యాప్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసగాళ్లు భారీగా దోచుకుంటున్నారు. ఇందుకోసం ఏకంగా ప్రత్యేకంగా కాల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనదేశంలో ఉత్తర భారతదేశం వేదికగా ఇటువంటి మోసాలు జరుగుతున్నాయి.
ఇక కొంతమంది అయితే సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారు. తమ బ్యాంకు ఖాతాలను వారికి అప్పగిస్తున్నారు. ఇటువంటి వాటిని పోలీసులు మ్యూల్ ఖాతాలు అని పేర్కొంటున్నారు. ఈ ఖాతాల వల్ల సైబర్ నేరగాళ్లు భారీగా నగదు లావాదేవీలు కొనసాగిస్తున్నారు. అంతేకాదు, భారీగా డబ్బును ఖాతాలలోకి మళ్లించి.. విత్ డ్రా చేసుకుంటున్నారు. ఇటువంటి కేసులలో మ్యూల్ ఖాతాలు ఇచ్చినవారు పోలీసులకు దొరికిపోతున్నారు. అసలు నేరస్తులు తప్పించుకుంటున్నారు. ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పెనుబల్లిలో ఆస్ట్రేలియా పౌరులను మోసం చేసిన ఘటనలో మ్యూల్ ఖాతాల వ్యవహారం బయటపడింది. అయితే ఆ ఖాతాలు ఇచ్చిన వారంతా అమాయకులు కావడం విశేషం. ఇలా చెప్పుకుంటూ పోతే సైబర్ నేరాలకు అంతు పొంతూ ఉండదు. ఇటువంటి నేరాల బారిన పడకూడదంటే స్వీయ జాగ్రత్త అత్యంత ముఖ్యం.