Money Laundering Scam: పోలీసులు ఎన్ని రకాలుగా అప్రమత్తమైనప్పటికీ.. ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నప్పటికీ సైబర్ నేరగాళ్లు ఏమాత్రం తగ్గడం లేదు. పైగా జనాలను దోచుకోవడానికి కొత్త కొత్త దారులను వెతుకుతున్నారు. రకరకాల పేర్లు చెప్పి జనాలను మోసం చేస్తున్నారు. ఈ తరహా ఘటనలు పెరిగిపోతున్నప్పటికీ.. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ సైబర్ నేరగాళ్లు కొత్తదారులలో జనాలను మోసం చేస్తున్నారు…
ఉమ్మడి కృష్ణాజిల్లా ఉయ్యూరులో శివశంకర్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ విశ్రాంత ఉద్యోగులు. ఇటీవల శివశంకర్ ఫోన్ కు ట్రాయ్ నుంచి ఒక కాల్ వచ్చింది. ” మేము ట్రాయ్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీ ఫోన్ నెంబర్ మీద ఒక డెబిట్ కార్డు ఉంది. అది కెనరా బ్యాంక్ ఇష్యూ చేసింది. నరేష్ గోయల్ అనే వ్యక్తి 530 కోట్ల మనీలాండరింగ్ వ్యవహారానికి పాల్పడ్డాడు. అందులో మీ పేరు మీద ఉన్న డెబిట్ కార్డు వాడుకున్నారు. మీ మీద కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. మేం చెప్పిన వివరాలు చెబితే మీ మీద నమోదైన కేసుల నుంచి ఉపశమనం పొందొచ్చని” ఆ వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు.
అనేక సందర్భాలలో ఆ వ్యక్తి శివశంకర్ దంపతులతో వీడియో కాల్ మాట్లాడాడు. పైకి మర్యాద నటిస్తూనే.. డెబిట్ కార్డ్ వివరాలు.. ఆధార్ కార్డు వివరాలు.. క్రెడిట్ కార్డ్ పిన్ నెంబర్ తో సహా అడిగాడు. మొదట్లో సిబిఐ పేరు చెప్పిన సైబర్ నేరగాడు.. రకరకాల వ్యక్తులను తెరపైకి తీసుకొచ్చాడు. చివరికి సుప్రీంకోర్టు జడ్జి పేరు కూడా ప్రస్తావించాడు. నిత్యం వీడియో కాల్స్ మాట్లాడుతూ శివశంకర్ దంపతులను భయభ్రాంతులకు గురి చేశాడు.
మొదట్లో సైబర్ నేరగాడు చెప్పిన వివరాలను విని శివశంకర్ షాక్ కు గురయ్యారు. ఆ సైబర్ నేరగాడు చెప్పిన వివరాలనే మిగతా వ్యక్తులు కూడా చెప్పడంతో ఒక్కసారిగా శివశంకర్ కు ఇదంతా మోసమని అర్థమైంది. మరో మాటకు తావు లేకుండా శివశంకర్ తన సోదరుడి ఇంటికి వెళ్ళాడు. అతడు ఉయ్యూరు టౌన్ సిఐ రామారావుకి ఫోన్ చేశారు. జరిగిన విషయం చెప్పడంతో. సీఐ వెంటనే రంగంలోకి దిగారు. సైబర్ నేరగాడు వీడియో కాల్ లో మాట్లాడుతుండగా సీఐ సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో సైబర్ నేరగాడు వీడియో కాల్ ఆఫ్ చేసాడు. శివశంకర్ ను బ్లాక్ చేశాడు.
ఈ ఘటన మొత్తాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వీడియో తీసింది. సైబర్ నేరస్తులు ఎంతకు తెగిస్తున్నారో.. వారు జనాలను ఎలా మోసం చేస్తున్నారో ఈ వీడియో ద్వారా వివరించారు. శివ శంకర్ సోదరుడు గనుక సిఐని సంప్రదించకపోయి ఉంటే.. సైబర్ నేరగాళ్లు కచ్చితంగా మోసం చేసేవారు. అందువల్లే డిజిటల్ అరెస్టులు.. సిబిఐ కేసులు.. మనీ లాండరింగ్ వ్యవహారాలలో ఎప్పుడు కూడా అధికారులు వీడియో కాల్స్ లోకి రారు. కేసుకు సంబంధించిన విషయాలను బయటపెట్టరు . విచారణ కూడా అధికారికంగా నిర్వహిస్తారు.