Financial Fraud: ఖాతాలో డబ్బులు క్రెడిట్ అయినట్టు మెసేజ్ వచ్చిందా.. మీరు మోసపోయినట్టే.. బెంగళూరు యువతికి ఎదురైన అనుభవం వైరల్

బెంగళూరుకు చెందిన ఒక కార్పొరేట్ కంపెనీలో పని చేస్తే అదితి చోప్రా అనే మహిళ.. తనకు ఎదురైన ఆర్థిక మోసం గురించి ట్విట్టర్ ఎక్స్ లో పంచుకున్నారు.. ఇంతకీ తన ఎలా మోసం చేయాలనుకున్నారో.. ఆమె సుదీర్ఘంగా రాసుకొచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.

Written By: Anabothula Bhaskar, Updated On : May 4, 2024 8:23 am

Financial Fraud

Follow us on

Financial Fraud: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు. అయితే వీటిని మంచి కోసం ఉపయోగిస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ చెడు కోసం, అక్రమ మార్గాలలో సంపాదించేందుకు ఉపయోగిస్తేనే ఇబ్బంది. ఇలాంటి దారులను అక్రమార్కులు ఎంచుకుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం పెరగడం, డిజిటల్ లావాదేవీలు తారాస్థాయికి చేరడంతో అక్రమార్కులు సరికొత్త మోసాలకు, ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. సైబర్ పోలీసులు ఎన్ని రకాలుగా చర్యలు తీసుకున్నా సరికొత్త పంథా లో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు.. అయితే ఇందులో విద్యాధికులే ఎక్కువగా ఉండటం విశేషం. అయితే బెంగళూరుకు చెందిన ఒక కార్పొరేట్ కంపెనీలో పని చేస్తే అదితి చోప్రా అనే మహిళ.. తనకు ఎదురైన ఆర్థిక మోసం గురించి ట్విట్టర్ ఎక్స్ లో పంచుకున్నారు.. ఇంతకీ తన ఎలా మోసం చేయాలనుకున్నారో.. ఆమె సుదీర్ఘంగా రాసుకొచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

“నేను ఆఫీస్ లో ఉన్నాను. నాకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు.. తన తండ్రికి డబ్బు పంపాలని కోరాడు. నా బ్యాంకు ఖాతాలో సమస్య ఉందని చెప్పాడు. ఆ తర్వాత నా ఫోన్ నెంబర్ గట్టిగా చెప్పాడు. అంతే క్షణాల్లో నా ఫోన్ కు బ్యాంక్ క్రెడిట్ ఎస్ఎంఎస్ ఎలా ఉంటుందో.. అదే ఫార్మాట్లో ఒక మెసేజ్ వచ్చింది. నా ఫోన్ కు ముందు INR 10,000 క్రెడిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది . ఆ తర్వాత INR 30,000 క్రెడిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. ఇవన్నీ కూడా ఆ వ్యక్తి నాతో కాల్ లో ఉన్నప్పుడే వచ్చాయి. అయితే అతను తన తండ్రికి మూడు వేలు మాత్రమే పంపాల్సి ఉందని చెప్పాడు. అనుకోకుండా 30,000 పంపానని అన్నాడు. అతడు ఆసుపత్రిలో ఉన్నాడని.. వైద్యుడికి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. మిగతా 27,000 పంపాలని కోరాడని” అదితి పేర్కొంది.

అతనితో ఫోన్ మాట్లాడుకుంటూనే అదితి ఆ మెసేజ్ లను జాగ్రత్తగా పరిశీలించింది.. ఆ మెసేజ్ లు పది అంకెల ఫోన్ నంబర్ నుంచి వచ్చాయి. బ్రాండెడ్ కంపెనీ ఐడీ నుంచి కాదు.. దీంతో అనుమానం వచ్చిన అదితి వెంటనే తన బ్యాంకు ఖాతాలలో బ్యాలెన్స్ చెక్ చేసింది.. అందులో డబ్బు జమ అయినట్టు కనిపించలేదు. ఈలోగా అవతలి వ్యక్తి కాల్ కట్ చేశాడు. మళ్లీ అదితి ట్రై చేయగా, ఆమె నెంబర్ బ్లాక్ లో పెట్టారు. దీనిపై ఆమె స్థానికంగా ఉన్న పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారు ఆ నెంబర్ ను సైబర్ క్రైమ్ పోలీసులకు పంపించారు. అదితి తనకు వచ్చిన మెసేజ్ లను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. దానికి బెంగళూరు సైబర్ సెల్ పోలీస్ విభాగాన్ని తయారు చేసింది. ఈ పోస్ట్ కు చాలా మంది రెస్పాండ్ అయ్యారు..”మా నాన్న ఇలాంటి స్కాంలో ఉచ్చులో పడ్డాడు. ఖాతాలో నగదు జమ అయిందని భావించి, నిజంగానే డబ్బు పంపాడు. మేము మోసపోయాం. పోలీసులకు ఫిర్యాదు చేశామని” ఓ నెటిజన్ పేర్కొన్నాడు..”ఈరోజు లక్నో కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నాకు విలువైన వస్తువులు వచ్చాయట. వాటి కోసం డబ్బు చెల్లించాలట.. ఇన్ని ఆర్థిక మోసాలు జరుగుతుంటే జాగ్రత్తగా ఉండాల్సిందే” నని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు. అదితి చేసిన ట్వీట్ ప్రస్తుతం “ఎక్స్” లో వైరల్ గా మారింది.