Pune : ఖరీదైన పోర్షే కారుతో బాలుడు ప్రాణాలు తీశాడు.. ఆ టీనేజర్ తండ్రిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు

అంతేకాకుండా మైనర్ కు మద్యం సప్లయ్ చేసిన పబ్ పై చట్టపరమైన చర్యలు చేపట్టారు. మైనర్ బాలుడికి మద్యం అందించడం, ఆ తర్వాత జరిగిన విషాదకర ఘటనలకు కారణమైనందుకు యజమానులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Written By: NARESH, Updated On : May 21, 2024 5:41 pm
Follow us on

Pune : మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో 17 సంవత్సరాల బాలుడి తండ్రిని పుణె పోలీసులు అరెస్టు చేశారు. తండ్రినే కాకుండా బాలుడికి మద్యం సరఫరా చేసిన బార్ల యజమానులను కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచారు పోలీసులు. ఈ యాక్సిడెంట్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది.

పుణెలోని కల్యాణి నగర్ ప్రాంతంలో ఆదివారం (మే 19) తెల్లవారు జామున ఒక కారు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 17 సంవత్సరాలు ఉన్న బాలుడు ఒక కంపెనీకి చెందిన లగ్జరీ కారుతో బైక్ ను ఢీ కొట్టాడు. దీంతో బైక్ పై ఉన్న అనిస్ అవధియా, అశ్విని కోస్తా ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఇరుకైన మార్గంలో కారు గంటకు 200 కిలో మీటర్ల వేగంతో నడుపుతున్నట్లు సీసీ టీవీలో రికార్డయింది.

ఇది ఒక మైనర్ చేసిన యాక్సిడెంట్ కావడంతో ఈ కేసును పుణె క్రైమ్ బ్రాంచ్ కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెషన్స్ కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న పుణె పోలీసులు బాలుడి తండ్రిపై జువెనైల్ జస్టిస్ చట్టంలోని 75, 77 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. పిల్లలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం, మైనర్ కు మద్యం, మత్తు పదార్థాలు లాంటివి ఇవ్వడం వంటివి ఈ సెక్షన్ల కిందికి వస్తాయి.

అనీష్ అవధియా, అశ్విని కోస్తా ఐటీ ఇంజినీర్లు. వీరు తమ కాలేజీలో గెట్ టు గెదర్ నిర్వహించుకొని తిరిగి వస్తుండగా తెల్లవారు జామున 2:15 గంటలకు యాక్సిడెంట్ జరిగింది.

పుణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ వివరాల ప్రకారం.. యాక్సిడెంట్ చేసి ఇద్దరి ప్రాణాలు పోయేందుకు కారణమైన మైనర్ బాలుడు తన 12వ తరగతి ఫలితాలు రావడంతో స్థానిక పబ్ లో సెలబ్రేట్ చేసుకున్నాడు. మహారాష్ట్రలో మద్యపానం తాగే వయస్సు 25 సంవత్సరాలు. అంతకు తక్కువ వయస్సు ఉన్న వారికి మద్యం ఇవ్వడం చట్టవిరుద్ధం. మైనర్ కు మద్యం సప్లయ్ చేసినందుకు బార్ యజమానులు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

జువెనైల్ జస్టిస్ బోర్డు నిందితుడైన మైనర్ ను నిర్బంధించిన 15 గంటల్లోనే బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. తప్పనిసరి కౌన్సిలింగ్, డీ అడిక్షన్ ప్రోగ్రాం, రోడ్డు భద్రతపై 300 పదాల వ్యాసం సహా పలు పునరావాస షరతులను బోర్డు విధించింది. ప్రమాద తీవ్రత దృష్ట్యా ఉదాసీనంగా స్పందించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బెయిల్ తీర్పుపై స్పందించిన పుణె పోలీసులు బాలుడిని వయోజనుడిగా విచారించాలని సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేరం తీవ్రతకు కఠినమైన న్యాయ పరిశీలన అవసరమనే నమ్మకంతో ఈ చర్య జరిగింది. నిన్న జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది హేయమైన నేరం కావడంతో నాన్ బెయిలబుల్ సెక్షన్ ఐపీసీ సెక్షన్ 304 కింద చర్యలు తీసుకున్నామని కమిషనర్ కుమార్ తెలిపారు.

అంతేకాకుండా మైనర్ కు మద్యం సప్లయ్ చేసిన పబ్ పై చట్టపరమైన చర్యలు చేపట్టారు. మైనర్ బాలుడికి మద్యం అందించడం, ఆ తర్వాత జరిగిన విషాదకర ఘటనలకు కారణమైనందుకు యజమానులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.