Zomato – RS 2 thousand Note : జోమాటోపై రూ.2వేల నోట్ల వరద.. తినేటోళ్ల ఐడియా మామూలుగా లేదుగా

అయితే కొంత మంది మర్చిపోయారు. గడువు ముగిశాక బయటకు తెచ్చారు. కొంతమంది హుండీల్లో వేశారు. ప్రస్తుతం కూడా తిరుమల లాంటి పెద్దపెద్ద ఆలయాల్లోని హుండీల్లో నోట్లు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Written By: Raj Shekar, Updated On : May 23, 2023 3:38 pm
Follow us on

Zomato – RS 2 thousand Note : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుక్రవారం రూ.2000 నోట్ల చలామణి ఉపసంహరించుకోవాలని ప్రకటించింది. దీంతో ఇన్నాళ్లు భద్రంగా దాచుకున్న నోట్లను ఇప్పుడు బయటకు తీస్తున్నారు. కొంతమంది క్యాష్‌ ఆన్‌ డెలివరీ(సీవోడీ)కి రూ.2 నోట్లే ఇస్తున్నారు. ప్రముఖ భారతీయ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో సోమవారం తమ క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆర్డర్‌లలో శుక్రవారం నుంచి 72% రూ.2 వేల నోట్లు చెల్లించినట్లు తెలిపింది.
బయటకు వస్తున్న నోట్లు..
ఇన్నాళ్లూ దర్శనమే మహాభాగ్యం అన్నట్లు ఉన్న రూ.2000 నోట్లు ఆర్‌బీఐ ప్రకటన తర్వాత ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. సెప్టెంబర్‌ 30 వరకు నోట్లు మార్చుకోవడానికి, డిపాజిట్‌ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఆర్‌బీఐ ప్రటన వచ్చిన నాటి నుంచి ఇన్నాళ్లూ భద్రంగా దాచుకున్న రూ.2000 నోట్లను పేద, మధ్య తరగతి వారు బయటకు తీస్తున్నారు. వీలైనంత త్వరగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ అధిక విలువ గల నోట్లను వదిలించుకోవాలని చాలామది ఇంధన కేంద్రాలు, ఆభరణాల దుకాణాలకు బారులు తీరారు.

తొందర లేదు.. 

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సోమవారం మాట్లాడుతూ రూ.2,000 మార్చడానికి బ్యాంకులకు తొందరపడాల్సిన అవసరం లేదని, గడువు ఇంకా నాలుగు నెలలు ఉన్నందున తెలిపారు. ఏదైనా ప్రక్రియలో ఉత్పన్నమయ్యే అన్ని సమస్యలపై సెంట్రల్‌ బ్యాంక్‌ పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. చెలామణి నుండి డినామినేషన్‌ను ఉపసంహరించుకోవాలనే నిర్ణయం రిజర్వ్‌ బ్యాంక్‌ యొక్క కరెన్సీ నిర్వహణ కార్యకలాపాలలో భాగమన్నారు. క్లీన్‌ నోట్‌ విధానానికి అనుగుణంగా ఉంటుంది. డీమోనిటైజేషన్‌ తర్వాత ఉపసంహరించుకున్న నోట్లను తిరిగి నింపడానికి రూ.2,000 ప్రవేశపెట్టామని వివరించారు. దాని ప్రయోజనం నెరవేరిందని తెలిపారు.
త్వరగా వదిలించుకోవాలని..
చెల్లని నోట్లను ఎంత తొందరగా తొలగించుకుంటే అంత మంచిది అన్నట్లుగా పేద, మధ్య తరగతి ప్రజలు భావిస్తున్నారు. మర్చిపోతే.. తర్వాత మార్చుకునే అవకాశం ఉండదని, నష్టపోతామని భావిస్తున్నారు. గతంలో 500, 1000 నోట్ల రద్దు తర్వాత కూడా చాలా మంది ఇలాగే మార్చుకున్నారు. బ్యాకుల్లో బారులు తీరారు. అయితే కొంత మంది మర్చిపోయారు. గడువు ముగిశాక బయటకు తెచ్చారు. కొంతమంది హుండీల్లో వేశారు. ప్రస్తుతం కూడా తిరుమల లాంటి పెద్దపెద్ద ఆలయాల్లోని హుండీల్లో నోట్లు వేస్తున్నట్లు తెలుస్తోంది.