Anant Ambani Radhika Wedding: ఓ మామూలు కేఫ్ యజమాని.. అంబానీ ఇంట పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణ.. ఎదురుపడి పలకరించిన అనంత్, ముఖేష్, నీతా

అనంత్ - రాధిక వివాహంలో ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు చోటు చేసుకున్నప్పటికీ.. ఒక మహిళ కు మాత్రం ఏకంగా ముఖేష్ అంబానీ- నీతా అంబానీ- అనంత్ అంబానీ ఎదురు వచ్చి స్వాగతం పలికారు. ఆమె రాకతో ఎంతో ఆనందపడ్డారు. ఆప్యాయంగా పలకరించారు. అనంత్ ఆమెకు నమస్కరించారు. తన భార్య రాధికను పిలిపించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : July 17, 2024 8:15 am

Anant Ambani Radhika Wedding

Follow us on

Anant Ambani Radhika Wedding: ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా అతిరథ మహారధులు హాజరయ్యారు. మూడు రోజులపాటు ముంబైలోని బాంద్రా కుర్లా హౌస్ కాంప్లెక్స్ లోనే జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో సందడి చేశారు. వివాహానికి హాజరైన అతిధులకు ముకేశ్ అంబానీ కుటుంబం అదిరిపోయే ఆతిథ్యం అందించింది. ఈ వివాహ వేడుకలో రాజకీయ నాయకుల నుంచి మొదలుపెడితే సినీ తారల వరకు హాజరయ్యారు. ప్రియాంక చోప్రా వంటి వారు నృత్యాలు చేస్తే.. రజనీకాంత్ వంటి స్టార్ హీరో పాదాలు కదిపారు.. సల్మాన్ ఖాన్ స్టెప్పులు వేస్తే.. షారుక్ ఖాన్ ఈల వేసి గోల చేశారు. ఇలా చెప్పుకుంటూ పోవాలే గాని.. అనితర సాధ్యమైన, అనన్య సామాన్యమైన దృశ్యాలు అనంత్ – రాధిక వివాహంలో ఎన్నో చోటుచేసుకున్నాయి.

ప్రత్యేక ఆకర్షణగా..

అనంత్ – రాధిక వివాహంలో ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు చోటు చేసుకున్నప్పటికీ.. ఒక మహిళ కు మాత్రం ఏకంగా ముఖేష్ అంబానీ- నీతా అంబానీ- అనంత్ అంబానీ ఎదురు వచ్చి స్వాగతం పలికారు. ఆమె రాకతో ఎంతో ఆనందపడ్డారు. ఆప్యాయంగా పలకరించారు. అనంత్ ఆమెకు నమస్కరించారు. తన భార్య రాధికను పిలిపించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె గురించి నెటిజన్లు తెగ శోధిస్తున్నారు.

ఇంతకీ ఆమె ఎవరు

అనంత్ – రాధిక వివాహానికి ముకేశ్ అంబానీ అనన్య సామాన్యమైన విందును అందించారు. విదేశీ రుచులతోపాటు పంజాబీ, గుజరాతి, కాశ్మీరీ వంటి స్వదేశీ రుచులను కూడా అతిధులకు రుచి చూపించారు. దాదాపు 2,500 పైగా వంటకాలను వచ్చిన వారికి వడ్డించారు. అయితే ఇందులో అంబానీ కుటుంబం ఎంతో ఇష్టపడే “మైసూర్ కేఫ్”నిర్వాహకులతో దక్షిణాది వంటకాలను కూడా వడ్డించారు. ఆ మైసూర్ కేఫ్ యజమాని పేరు శాంతేరి నాయక్. ఈ కేఫ్ అంటే ముఖేష్ అంబానికి చాలా ఇష్టం. ఆయన టీనేజ్ లో ఉన్నప్పుడు ఇక్కడ టిఫిన్ తిని, టీ తాగేవారు. కొన్నిసార్లు భోజనం కూడా చేసేవారు. వేల కోట్లకు అధిపతి అయినప్పటికీ.. అప్పుడప్పుడు ముఖేష్ అంబానీ ఇక్కడ టిఫిన్ తింటూ ఉంటారు. ఇష్టంగా టీ తాగుతూ ఉంటారు. ఆయన మాత్రమే కాదు కుటుంబ సభ్యులు కూడా మైసూర్ కేఫ్ లో టిఫిన్ చేస్తుంటారు. అయితే ఈ కేఫ్ యజమాని శాంతేరి నాయక్ ను ముకేశ్ అంబానీ తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని మన్నించి శాంతేరి వివాహానికి వచ్చారు. ఈ సందర్భంగా అనంత్ – రాధిక ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. “ప్రతి ఆదివారం మా ఇంట్లో వాళ్లు మొత్తం మీరు తయారు చేసిన భోజనాన్ని తింటున్నారని” రాధిక శాంతేరి నాయక్ తో వ్యాఖ్యానించారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనాన్ని సృష్టిస్తోంది.

ఎక్కడ ఉందంటే

మైసూర్ కేఫ్ దక్షిణ ముంబైలోని మతుంగా ప్రాంతంలో ఉంది. ముంబైలో అత్యంత పేరు పొందిన రెస్టారెంట్లలో మైసూర్ కేఫ్ ముందు వరుసలో ఉంటుంది. 1936లో కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు ప్రాంతానికి చెందిన రామానాయక్ ముంబై కి వచ్చారు. ఈ ప్రాంతంలో మైసూర్ కేఫ్ పేరుతో రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ తయారుచేసే వంటకాలను అంబానీ కుటుంబ సభ్యులు అత్యంత ఇష్టపడుతుంటారు. ఇదే విషయాన్ని ముకేశ్ అంబానీ గతంలో పలు వేదికలలో వెల్లడించారు. “నేను చదువుకునే రోజుల్లో ప్రతిరోజు మైసూర్ కేఫ్ వెళ్లేవాడిని. అక్కడ టిఫిన్ తినేవాడిని. టీ కూడా తాగేవాడిని. భోజనం ఎన్నిసార్లు తిన్నానో లెక్కలేదు. అక్కడ తింటుంటే ఇంట్లో తిన్నట్టే ఉంటుందని” ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. ఇక ప్రతి ఆదివారం మైసూర్ కేక్ నుంచి అంబానీ కుటుంబానికి ప్రత్యేకంగా భోజనాలు వెళతాయి. అయితే ఈ మెనూ శాంతేరా దగ్గరుండి పర్యవేక్షిస్తుంటారు. అంతేకాదు ఒక ఆదివారం పంపించిన మెనూ.. మరో ఆదివారం పంపించరు. ప్రతి వారానికి మెనూ మారుతూనే ఉంటుంది. అయితే ఈ వంటకాల తయారీ లో ఏం వాడతారు? అంబానీ కుటుంబ సభ్యులు ఇష్టంగా ఏం తింటారు? అనే విషయాలు శాంతేరి, ఆమె పాకశాస్త్ర నిపుణులు బయటికి చెప్పరు.