Edible Oil Prices: దేశంలో వంటనూనె ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. పెరుగుతున్న ధరల వల్ల సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. మరోవైపు రోజురోజుకు నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతుండటంతో సామాన్యులు టెన్షన్ పడుతున్నారు. కొన్నిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న వంటనూనె ధరలకు బ్రేక్ వేసింది. కేంద్ర ప్రభుత్వం వంటనూనె ధరలను ఏకంగా 7 రూపాయల నుంచి 20 రూపాయల వరకు తగ్గించడం గమనార్హం.
సాల్వెంట్ ఎక్స్ట్రాకర్స్ అసోసియేషన్ రాబోయే రోజుల్లో వంటనూనె ధరలు మరింతగా తగ్గుతాయని వెల్లడించడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం నూనెలపై దిగుమతి సుంకాలను తగ్గించిన నేపథ్యంలో నూనె గింజలు కిలోకు 3 రూపాయల నుంచి 4 రూపాయలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు దేశీయంగా సాగు చేస్తున్న నూనె గింజల వల్ల కూడా నూనె ధరలు మరింతగా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.
నూనె గింజల పంటలు చేతికి వచ్చే సమయం కావడంతో కొత్త క్రషింగ్ సీజన్ ప్రారంభమై వంటనూనెల ధరలు దిగి రానున్నాయని సమాచారం అందుతోంది. రాబోయే నెల రోజులలో లీటర్ నూనెపై 4 రూపాయలు తగ్గే ఛాన్స్ అయితే ఉంది. దేశంలో 77.62 లక్షల హెక్టార్లలో ఆవాలు సాగు చేయగా గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం 30 శాతం ఎక్కువ కావడం గమనార్హం. మన దేశంలో సంవత్సరానికి 22 - 22.5 మిలియన్ టన్నుల వంటనూనెలను వినియోగిస్తున్నారు.
మన దేశం ఇతర దేశాల నుంచి 13 – 15 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకుంటుండగా కరోనా మహమ్మారి వల్ల వంటనూనెల దిగుమతులపై భారీగా ప్రభావం పడిందని తెలుస్తోంది. రోజురోజుకు వంటనూనె ధరలు తగ్గుతుండటంతో సామాన్యులకు కూడా ప్రయోజనం చేకూరనుంది.