Gold Loans: బంగారంపై రుణం తీసుకునే వినియోగదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా రుణగ్రహీతలకు మరింత ఎక్కువ మొత్తంలో రుణం అందేలా లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తిలో సడలింపులు ప్రకటించింది. దీంతో బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకునే వారికి గతంతో పోలిస్తే అధిక మొత్తంలో లోన్ పొందే అవకాశం లభించనుంది. ఆ వివరాల్లోకి వెళితె..
ఇప్పటి వరకు సాధారణంగా బంగారం విలువలో గరిష్టంగా 75 శాతం వరకు మాత్రమే రుణం మంజూరు చేసేవారు. అయితే కొత్త మార్గదర్శకాల ప్రకారం రూ.2.5 లక్షల వరకు గోల్డ్ లోన్ తీసుకునేవారికి బంగారం విలువలో 85 శాతం వరకు రుణం ఇవ్వడానికి అనుమతి లభించింది. దీనివల్ల అత్యవసర అవసరాల కోసం చిన్న మొత్తాల రుణాలు తీసుకునే వారికి పెద్ద ఉపశమనం కలగనుంది. ఉదాహరణకు రూ.1 లక్ష విలువైన బంగారం ఉంటే, గతంలో గరిష్టంగా రూ.75,000 మాత్రమే రుణంగా లభించేది. కొత్త నిబంధనల ప్రకారం రూ.2.5 లక్షల లోపు రుణాల కేటగిరీలోకి వస్తే అదే బంగారంపై రూ.85,000 వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది.
అలాగే రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణం తీసుకునే వారికి బంగారం విలువలో 80 శాతం వరకు లోన్ మంజూరు చేయనున్నారు. ఇది మధ్యస్థాయి రుణగ్రహీతలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయంగా బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అదే బంగారంపై గతంతో పోలిస్తే ఎక్కువ నిధులు పొందే అవకాశం ఉంటుంది.
ఇక రూ.5 లక్షలకు మించిన గోల్డ్ లోన్ల విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 75 శాతం LTV నిష్పత్తినే కొనసాగించనున్నారు. అధిక మొత్తంలో రుణాలు తీసుకునే సందర్భాల్లో బ్యాంకుల రిస్క్ను దృష్టిలో ఉంచుకుని ఈ పరిమితిని కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది.
ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంతాలు, చిన్న వ్యాపారులు, రైతులు, అత్యవసర నగదు అవసరాలు ఉన్న కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ముఖ్యంగా వైద్య ఖర్చులు, విద్య, వ్యవసాయ అవసరాలు, చిన్న వ్యాపారాల నిర్వహణ కోసం గోల్డ్ లోన్లపై ఆధారపడే వారికి ఇది పెద్ద ఊరటనిచ్చే చర్యగా భావిస్తున్నారు.
అయితే రుణం తీసుకునే ముందు వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, రుణ కాలపరిమితి, చెల్లింపు నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో రుణం లభిస్తున్నప్పటికీ, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే రుణం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

