Godavari Biorefineries IPO : కెమికల్ తయారీ కంపెనీ గోదావరి బయోఫైనరీస్ ఐపీఓ బుధవారం అక్టోబర్ 23న మార్కెట్లో ప్రారంభం కానుంది. ఈ మూడు రోజుల షేర్ సేల్ ద్వారా రూ.554.75 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐపీవో తాజా ఇష్యూ, ఆఫర్ ఫర్ సేల్ (OFS) కలయిక. గోదావరి బయోఫైనరీస్ తన ఐపిఓ కింద 15,759,938 షేర్లను విక్రయించడం ద్వారా రూ. 554.75 కోట్లను సమీకరించాలనుకుంటోంది. 229.75 కోట్ల విలువైన 65,26,983 షేర్లను కంపెనీ ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా జారీ చేస్తారు. ఐపీవో ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 334 నుండి రూ. 352 మధ్య నిర్ణయించబడింది. తాజా షేర్ల విక్రయం ద్వారా సేకరించిన నిధుల నుంచి రూ.240 కోట్లతో కంపెనీ తన రుణాన్ని తీర్చనుంది. మిగిలిన నిధులను కంపెనీ అభివృద్ధికి వినియోగిస్తామన్నారు.
ముఖ్యమైన తేదీలు
ఈ పబ్లిక్ ఆఫర్ అక్టోబర్ 23 నుండి అక్టోబర్ 25 వరకు సబ్స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం బిడ్లను అక్టోబర్ 22న ఉంచనున్నారు. అక్టోబర్ 28న కేటాయింపు ప్రక్రియ, అక్టోబర్ 30న లిస్టింగ్ జరిగే అవకాశం ఉంది.
ఇన్వెస్టర్లు ఒక లాట్లో 42 షేర్లు
గోదావరి బయోఫైనరీస్ ఐపీవో కోసం సబ్స్క్రయిబ్ చేయడానికి, రిటైల్ పెట్టుబడిదారులు ఒక లాట్కి కనీసం రూ.14,784 పెట్టుబడి పెట్టాలి. రిటైల్ ఇన్వెస్టర్లకు ఒకే లాట్లో 42 షేర్లు అందించబడతాయి. రిటైల్ పెట్టుబడిదారులు గరిష్టంగా 13 లాట్లకు బిడ్ చేయవచ్చు. ఐపీవోలో రిజర్వేషన్ గురించి మాట్లాడితే.. 50శాతం షేర్లు అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు, 35శాతం రిటైల్ పెట్టుబడిదారులకు, 15శాతం నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేయబడ్డాయి. కంపెనీ ప్రమోటర్లలో సమీర్ శాంతిలాల్ సోమయ్య, లక్ష్మీవాడి మైన్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సకర్వాడి ట్రేడింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, సోమయ్య ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి.
కంపెనీ ఏం చేస్తుంది?
570 KLPD బయోఫైనరీ సామర్థ్యంతో భారతదేశంలో ఇథనాల్ ఆధారిత రసాయనాల తయారీలో కంపెనీ అగ్రగామిగా ఉంది. రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (RHP) ప్రకారం, మార్చి 31, 2024 నాటికి భారతదేశంలో అతిపెద్ద ఇథనాల్ ఉత్పత్తిదారులలో కంపెనీ ఒకటి. కంపెనీ బయో-ఆధారిత రసాయనాలు, చక్కెర, వివిధ రకాల ఇథనాల్, పవర్ వంటి ఉత్పత్తుల శ్రేణిని అందిస్తుంది. ఈ ఉత్పత్తులు ఆహారం,పానీయాలు, ఔషధాలు, రుచులు, సువాసనలు, శక్తి, ఇంధనం, వ్యక్తిగత సంరక్షణ, సౌందర్య సాధనాల వంటి పరిశ్రమలలో ఉపయోగించబడతాయి.
కంపెనీ కస్టమర్లలో హెర్షే ఇండియా, హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్, కర్ణాటక కెమికల్ ఇండస్ట్రీస్, టెక్నో వాక్స్చెమ్, ఎస్కార్ట్స్ కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇది కాకుండా, కంపెనీ తన ఉత్పత్తులను ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలకు కూడా సరఫరా చేస్తుంది.