Artificial Intelligence Jobs: నేటి కాలంలో చదివిన చదువుకు సరైన ఉద్యోగం సాధించడం కష్టంగా మారింది. ఒకవేళ ఉద్యోగం సాధించినా దానిని కాపాడుకోవడం మరింత ఇబ్బందిగా మారింది. అందువల్లే చాలామంది డిగ్రీ పట్టాలతో రోడ్లమీద ఖాళీగా తిరుగుతున్నారు. కొందరైతే చదివిన చదువుకు సంబంధం లేని ఉద్యోగం చేస్తున్నారు. జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలి.. కనీసం ఖర్చులకు సరిపడా సంపాదించుకోవాలనే ఉద్దేశంతో.. అహాన్ని పక్కన పెట్టి ఇష్టం లేని ఉద్యోగాలను కష్టంతో చేస్తున్నారు.
కొంతకాలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్ మార్కెట్లో విపరీతమైన అలజడి ఏర్పడింది. ఐటీ రంగంలో కొన్ని విభాగాల అవసరం లేకుండా పోయింది. ఫలితంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద పడుతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు ఏదో ఉద్యమం లాగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తొలగింపు ప్రక్రియను ఎప్పటికీ కొనసాగుతుందని చెబుతున్నాయి. ఈ ప్రకారం చూసుకుంటే భవిష్యత్తు కాలంలో ఐటీ కంపెనీలు కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా సేవలు కొనసాగించే అవకాశం ఉంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్ మార్కెట్ లో కొత్త ఉద్యోగాలు రావా.. నూతన ఉద్యోగాల సృష్టి లేకపోతే ప్రస్తుతం చదువుతున్న వారి సంగతేంటి.. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వారి పరిస్థితి ఏంటి.. ఇవే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడుతున్న అవకాశాలు చాలామందిలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉద్యోగాలు పోతాయని చాలామంది భావించినప్పటికీ.. అందులో నూటికి నూరు శాతం వాస్తవం లేదని నిపుణులు అంటున్నారు.
ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ లో ఉద్యోగాలు భారీగా ఉన్నాయి. ఈ రంగంలో కి లింక్డ్ ఇన్ అడుగుపెడుతూ.. ఏఐ లేబర్ మార్కెట్ ప్లేస్ ను పరీక్షిస్తోంది. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ట్రైనర్లకు నైపుణ్యాన్ని బట్టి గంటకు 3,700 నుంచి 14 వేల వరకు ఇస్తామని లిస్టింగ్ లో వెల్లడించింది. ఇందులో భాగంగా ఆయా రంగాల నిపుణులు ఏఐ టూల్స్ సామర్ధ్యాలను పరీక్షిస్తారు. స్పందనలకు రేటింగ్ ఇస్తారు. లోపాలను గుర్తిస్తారు. తద్వారా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీని యూజర్ ఫ్రెండ్లీగా మార్చేస్తారు. పెద్దపెద్ద కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకి ప్రవేశించిన నేపథ్యంలో.. లింక్డ్ ఇన్ కూడా ఇందులోకి అడుగుపెడుతోంది. ఎందుకంటే భవిష్యత్ కాలం మొత్తం దీనిదే కాబట్టి.. ఇందులో భారీగా పెట్టుబడులుపెడుతోంది.
“ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయని అందరూ అనుకున్నారు. కానీ ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఉద్యోగుల కల్పన ఆ రంగంలో కూడా ఉండడం ఆనందాన్ని కలిగిస్తోంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నిపుణులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలి. నిత్య విద్యార్థి లాగా మారి నిత్యం నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే ఈ పోటీ ప్రపంచంలో ఎదుగుతారని” ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు.
