AP Government- CAG: అత్యధిక మెజార్టీతో గెలుపొందాం కదా అని ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తామంటే కుదరదు. ఎవరైనా రాజ్యాంగబద్ధంగా పాలన చేయాల్సిందే. ప్రజలు ఎన్నుకున్నంత మాత్రాన ఐదు సంవత్సరాలు వారికి రాసిచ్చినట్టు కాదు. ప్రజల నుంచి వసూలు చేసే పన్నులైనా.. వారిని చూపించి చేసే అప్పునైనా పద్ధతి ప్రకారమే వాడాల్సి ఉంటుంది. ఖర్చు విషయంలో అసెంబ్లీ ఆమోదం సైతం పొందాలి.ఖర్చుల వివరాలు రాజ్యాంగ సంస్థ అయిన కాగ్ కు నెలనెలా తెలియజేయాలి.దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇలానే చేస్తున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత లెక్క తప్పుతూ వస్తోంది. ఎక్కడ అప్పులు తెస్తున్నారు? ఏయే రూపంలో తెస్తున్నారు? ఎంతెంత ఖర్చుపెడుతున్నారు? ఎవరికీ తెలియదు. అసలు ప్రభుత్వంలో కీలక భాగస్థులైన మంత్రులు, అధికారులకు కూడా తెలియదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చివరికి కాగ్ కు కూడా చెప్పడం లేదు.
ఒక్క నెల వివరాలు లేవు..
ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తోంది. కానీ ఏపీ ప్రభుత్వం ఆదాయ వ్యయాల వివరాలేమీ లేవు. ఒక్క ఏప్రిల్ నెలకు సంబంధించి వివరాలను మాత్రమే కాగ్ ఆన్ లైన్ లో పెట్టింది. అంటే మిగతా మూడు నెలలకు సంబంధించి అతీగతీ లేదు. దీనిపై కాగ్ ను అడుగుతుంటే ఏపీ నుంచి తాము అడిగిన వివరాలేవీ రావడం లేదని చెబుతోంది. అయితే ఈ విషయంలో ఏపీ కంటే తెలంగాణ ప్రభుత్వం మెరుగైన స్థితిలో ఉంది. జూన్ నెల వరకూ లెక్కలన్నింటినీ క్లీయర్ చేసి కాగ్ కు వివరాలు అందించింది. కేవలం జూలై మాత్రమే పెండింగ్ లో ఉంది. ఏపీ సర్కారు మాత్రం మీనమేషాలు వేస్తోంది. ఈ నేపథ్యంలో కాగ్ సీరియస్ అయ్యింది. ఆదాయ వ్యయ వివరాలను అందించాలని ఏపీ సర్కారుకు మరోసారి కోరింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా తొలి నెల లెక్కలు ఇంతవరకూ అందించకపోవడం ఏమిటని ప్రశ్నించింది. దీంతో ఏపీ సర్కారులో కలవరం ప్రారంభమైంది. విపక్షాలకు విమర్శనాస్త్రంగా మారింది.
Also Read: Ambati Rambabu Vs Janasena: అంబటి రాంబాబును తగులుకున్న జనసేన
గత ఆర్థిక సంవత్సరంలో..
వాస్తవానికి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా కాగ్ కు సక్రమంగా వివరాలు అందించలేదు. దీంతో తరచూ కాగ్ కార్యాలయం నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యాయాలనికి లేఖలు రాయడంతో పాటు సంప్రదింపులు జరుపుతున్నారు. కానీ ఏపీ అధికారులు మాత్రం సరిగా స్పందించలేకపోతున్నారు.ప్రధానంగా రుణాలు, ష్యూరిటీల విషయంలో నెలకొన్న సందిగ్ధమే జాప్యానికి కారణమని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా వ్యవహరిస్తే కాగ్ అగ్గి మీద గుగ్గిలమవుతుంది. కానీ ఏపీ విషయంలో మెతక వైఖరి అవలంభిస్తోంది. దీనిపై ఢిల్లీ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మినహాయింపుపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
కేంద్రం మెతక వైఖరి..
దేశంలో 11 రాష్ట్రాలు స్థాయికి మించి అప్పలు చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. శ్రీలంక ఉదంతాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు సున్నిత హెచ్చరికలు పంపింది. అటు ప్రధాని మోదీ కూడా ఉచిత పథకాలు అభివృద్ధి నిరోధకాలుగా అభివర్ణించారు. నగదు బదిలీ పథకానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఏపీ ఉచిత పథకాలు, నగదు బదిలీ పథకాలతో ఆర్థిక క్రమ శిక్షణ కట్టుదాటినట్టు గణాంకాలతో సహా వివరాలు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి. దీంతో అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఏపీ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించకూడదని నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ కాగ్ అడిగిన వివరాలు ఇవ్వకపోయినా ఏపీ సర్కారు విషయంలో కేంద్రం ఎందుకు మెతక వైఖరి అవలంభిస్తుందోనన్న అనుమానం కలుగుతోంది.
Also Read:Jawaharlal Nehru: వారసత్వం పేరిట దాడి… నెహ్రూ ఖ్యాతిని కనుమరుగు చేసే యత్నం
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More