YSR Congress Mavigun support: జగన్ ఏం చేసినా? ఏ నిర్ణయం తీసుకున్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భజన బృందం అలానే సమర్థిస్తుంది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ఆమోదించగా.. జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మావిగన్ రాజధాని ప్రతిపాదన చేశారు. దీంతో వైసిపి బ్యాచ్ అద్భుత నిర్ణయం అంటూ ఆకాశానికి ఎత్తేసింది జగన్మోహన్ రెడ్డిని. జగన్ కొత్త ప్రతిపాదనను తమ నినాదంగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారికి ఇష్టం అయి ఉండొచ్చు కానీ మావిగన్ ప్రతిపాదనను మాత్రం రాష్ట్ర ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కు గురవుతున్నారు. జగన్ తో పాటు వైసిపి పై మీమ్స్ చేస్తూ సోషల్ మీడియా మొత్తం మావిగన్ ను ట్రెండింగ్ లో ఉంచుతోంది.
వీర లెవెల్లో ట్రెండింగ్..
అయితే ఇంతవరకు సోషల్ మీడియాలో( social media) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపేవారు సైతం ఈ ట్రెండింగ్ చూసి తలలు పట్టుకుంటున్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరువు పాతాళంలోకి వెళ్లిపోయిందని ఆవేదనతో ఉన్నారు. ఈ డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతలు రంగంలోకి దిగారు. అయితే వారు తమంతట తాము దిగారా? జగన్మోహన్ రెడ్డి వారిని దించారా? అన్నది తెలియాల్సి ఉంది. ముందుగా వైసిపి కాపు టైగర్ గా జగన్ వద్ద బిరుదు పొందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర రాజధానిగా మావిగన్ సరైన నిర్ణయం అని జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనను సమర్థించారు. మరోవైపు సీనియర్ మోస్ట్ లీడర్ బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. జగన్మోహన్ రెడ్డి అమరావతిని వ్యతిరేకించలేదు కదా అని ప్రశ్నించారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో రాజధానిగా అమరావతి పై విషం చిమ్మేందుకు, మావిగన్ ను సమర్థించేందుకు మీడియా ముందుకు వైసీపీ కాపు నేతలు రావడం చూస్తుంటే మాత్రం అనుమానాలకు తావిస్తోంది. ఒక వ్యూహం ప్రకారం కాపు నేతలను ఇరికించి.. వారితోనే అమరావతి పై విషం చిందించాలని కనిపిస్తోంది.
సొంత సామాజిక వర్గ నేతలు లేరా
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం నేతలు ఎంతోమంది ఉన్నారు. వారు కనీసం నోరు తెరవలేదు. వారిని తన కుటుంబ వ్యవహారాల విషయంలో వాడుకుంటున్నారు జగన్. మొన్న ఆ మధ్యన షర్మిలపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని వదిలారు. దీంతో ఆమె గట్టిగానే ఇచ్చి పడేసారు. తనతో పాటు తన తల్లి విజయమ్మపై విమర్శలు చేస్తున్న వారిని కుక్కలతో పోల్చారు. అందుకే వైయస్ కుటుంబ వ్యవహారాలు మాట్లాడేందుకు రెడ్డి సామాజిక వర్గం నేతలు ముందుకు రావడం లేదు. అయితే ఇప్పుడు రాజధాని అనేది విపరీతమైన విమర్శలతో కూడుకున్నది. ఆ మాట చెబితేనే సాధారణ ప్రజలు సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైసీపీ కాపు నేతలు రంగంలోకి దిగి విమర్శలు చేస్తుండటం మాత్రం గమనార్హం. తన సామాజిక వర్గ నాయకుల రాజకీయ భద్రత కోసం కాపు సామాజిక వర్గం నేతల రాజకీయ భవిష్యత్తును బలిపీఠం ఎక్కిస్తున్నారా? అనే అనుమానాలు కూడా చాలా కలుగుతున్నాయి.