YSRCP winning chances analysis: ఏపీలో తప్పకుండా మళ్లీ అధికారంలోకి వస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా భావిస్తోంది.. అయితే అది ఎలా? ఆ పార్టీకి తెలియాలి. ఎందుకంటే ఆ పార్టీ ప్రజా పోరాటాలు చేయడం లేదు. శాసనసభకు వెళ్లి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడం లేదు. గట్టిగా ప్రశ్నించడం లేదు కూడా. పోనీ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపుతున్నారా అంటే అదీ లేదు. నిన్న పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. కానీ చాలా నియోజకవర్గాల్లో అసలు ఈ ఆందోళన కార్యక్రమాలు కనిపించలేదు. పెద్ద పెద్ద నేతలు అంతా ముఖం చాటేసారు. అయినా సరే అధికారంలోకి వచ్చేస్తాం అన్న ప్రకటనలు మాత్రం విపరీతంగా వినిపిస్తున్నాయి. అసలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రస్థానం పరిశీలిస్తే 2014 నుంచి 2019 మధ్య ఓకే.. 2019లో అధికారంలోకి వచ్చాక 2024 ఎన్నికలను టార్గెట్ చేసుకొని సంక్షేమ పథకాలను విచ్చలవిడిగా అమలు చేసేసింది. అభివృద్ధిని వదిలేయడంతో ప్రజలు దానిని ఒక నిర్లక్ష్యంగా గుర్తించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు. ప్రజలు ఎలా భావించి కూటమికి అధికారం కట్టబెట్టారో.. అదే మాదిరిగా పాలన సాగుతోంది.
అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యం
ఒకవైపు కూటమిపాలనను పరిశీలిద్దాం. అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతోంది. దానిపై విషం చిమ్ముతుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ. ఇంకోవైపు పోలవరం నిర్మాణం జరుగుతోంది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర ఐటీ హబ్ గా మారుతుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రాయలసీమకు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తయారీ రంగ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. రాష్ట్రం లో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయి. అదే సమయంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకారుల వేటనిషేధ భృతి, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్.. ఇలా ప్రధాన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ప్రజల్లో సంతృప్తి శాతం కనిపిస్తోంది. గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోంది. ఇన్ని జరిగాక కూడా తాము అధికారంలోకి వచ్చేస్తాం అంటూ పగటి కలలు కంటోంది వైయస్సార్ కాంగ్రెస్.
ఇవన్నీ మైనస్ లే కదా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్లడం లేదు. ప్రజా సమస్యలను ప్రస్తావించే అవకాశం కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యకు రావడం లేదు. వస్తేగిస్తే ఆ పార్టీ నేతల అరెస్టు సమయంలో పరామర్శలకు వస్తున్నారు. ప్రజా పోరాటాల్లో పాల్గొనడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పై ఉన్న కోపంతో అమరావతిని పడకేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను అస్తవ్యస్తం చేశారు. అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలతో మరోసారి అధికారంలోకి రావాలని భావించారు. అది మొన్నటి ఎన్నికల్లో వికటించిన ఆయన గుర్తించలేకపోయారు. ఇప్పటికీ అదే ధోరణితో ముందుకు వెళ్తున్నారు. అయినా అధికారం వచ్చేస్తుంది అంటూ ధీమాతో ఉన్నారు. అది ఎంత మాత్రం తగదు కూడా..
