YSRCP Vs BJP: తిరుగుబాటు అనేది గొప్ప గుర్తింపు తెచ్చిపెడుతుంది. ఈ విషయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని( Y S Jagan Mohan Reddy ) చక్కటి ఉదాహరణగా పేర్కొనవచ్చు. గల్లి నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీని వ్యతిరేకించారు జగన్. ఢీకొట్టే పని చేశారు. అది ప్రజలకు నచ్చింది. ప్రజలకు అనేకంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆకర్షించింది. కాంగ్రెస్ ను వ్యతిరేకించారే కానీ ఆ పార్టీ భావజాలంతోనే ముందడుగు వేశారు జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన ముస్లిం,మైనారిటీ, క్రిస్టియన్ వర్గాలను ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీని కేవలం విభేదించారే.. తప్ప ఆ పార్టీ సిద్ధాంతాలని వైసీపీ కొనసాగించింది. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి బిజెపి స్నేహంతో ముందుకు వెళ్లాల్సిన అనివార్య పరిస్థితి జగన్ మోహన్ రెడ్డి ది. అయితే బిజెపి సిద్ధాంతానికి వ్యతిరేకమైన భావజాలం వైసీపీ ది. బిజెపి పేరు చెబితే అల్లంత దూరం వెళ్లిపోయే కొన్ని వర్గాలు వైసిపికి ప్రధాన ఓటర్లు. అయితే ఇప్పుడు క్రమేపి వారు పార్టీకి దూరమవుతున్నట్లు స్పష్టమవుతోంది.
* స్పష్టమైన సంకేతాలు..
అయితే ఏ ప్రయత్నం అయినా కొంతకాలమే పనిచేస్తుంది. బిజెపిని( Bhartiya Janata Party) పట్టుకుని వదిలిపెట్టని రీతిలో ముందుకు సాగారు జగన్. కానీ ఇకనుంచి అలా ఉండదని సంకేతాలు పంపించింది కేంద్రం. అమరావతి రాజధాని కి చట్టబద్ధత కల్పించింది. ఈ నేపథ్యంలో వ్యతిరేకించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడింది అదే బిజెపి. ఏకంగా పిల్ల కాంగ్రెస్ అనేదాకా పరిస్థితి వచ్చింది. పార్లమెంట్ సాక్షిగా బిజెపి అగ్ర నేతలు లక్ష్మణ్ లాంటివారు వైసీపీని పిల్ల కాంగ్రెస్తో పోల్చారు. కనీస రాజకీయ గౌరవం ఇవ్వకుండా వ్యాఖ్యలు చేశారు.
* వ్యక్తిగత ప్రయోజనాల కోసం..
అయితే బిజెపి ఇంతటి పరిస్థితికి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఆయన రాష్ట్రం కోసం కాకుండా తన కోసం బిజెపితో స్నేహం చేశారు. తటస్థ ముసుగులో అడగకుండానే బిజెపికి మద్దతు పలుకుతూ వచ్చారు. కానీ జగన్ లాంటి నేత వైఖరితో తమకు ఇబ్బందులు అని బిజెపికి తెలిసి వచ్చింది. అందుకే ఎటువంటి సాయం, స్నేహం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో లేదని సంకేతాలు ఇచ్చింది బిజెపి. రాజకీయాల్లో ఏ పార్టీకైనా అస్తిత్వం అనేది పోరాటాల ద్వారా వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి కూడా అది సాధ్యమైంది. కానీ ఇప్పుడు ఆ సాహసం చేయలేకపోతున్నారు జగన్. చేసిన మరుక్షణం కేసుల రూపంలో కష్టాలు రావడం ఖాయమని భయపడుతున్నారు. బిజెపికి లొంగిపోవడంతో సొంత ఓటు బ్యాంకు కూడా కోల్పోయే ప్రమాదం ఇప్పుడు ఏర్పడింది. అయితే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవాలి అంటే బిజెపిపై రాజీలేని పోరాటం ప్రకటించడమే మేలు. లేకుంటే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ చరిత్రలో కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం.
