YSRCP Caste Politics: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును ఖరారు చేశారు. అయితే ఇప్పుడు కాపు సామాజిక వర్గం వారు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నవారు దీనిని తప్పు పట్టవచ్చు. కానీ దీనిని ముందుగానే పసిగట్టారు పవన్ కళ్యాణ్. తన కష్టకాలంలో తన వెంట ఉన్న వారిని మాత్రమే గుర్తించుకుంటానని.. పార్టీపై ఒక కులం ముద్ర వేస్తే ఊరుకునేది లేదని.. 2019లో ఈ కుల నేతలంతా ఎక్కడికి వెళ్లిపోయారని ప్రశ్నించారు. మరోవైపు కులం కులం అంటూ కాపు కులాన్ని జనసేనకు ఆపాదిస్తూ వచ్చారు. అందుకే ఇప్పుడు లింగమనేని రమేష్ అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేయడం ద్వారా వారికి షాక్ ఇచ్చారు పవన్.
* టిడిపి,వైసిపిలపై వ్యతిరేక ప్రచారం..
తెలుగుదేశం పార్టీ కాపులకు ప్రాధాన్యం ఇస్తోందని ప్రచారం చేసేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అదిగో పవన్ కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తున్నారని చెబుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఎలా చూసుకున్నా ఆ రెండు పార్టీలకు సొంత సామాజిక వర్గాల వారు దూరం కావాలి. అప్పుడే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడేది. ఆ పార్టీ ఆలోచన కూడా అదే. అయితే ఎన్నడు పవన్ కళ్యాణ్ కాపుల విషయంలో బాహటంగా ప్రకటనలు చేయలేదు. కాపులు మాత్రం పవన్ విషయంలో సానుకూలంగా ఉన్నారు. కానీ అదే కాపుల్లో చీలిక తేవాలన్న ఉద్దేశంతో.. నాదెండ్ల మనోహర్ పార్టీలో నెంబర్ 2 గా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా రాజ్యసభ పదవి కమ్మ సామాజిక వర్గానికి చెందిన లింగమనేని రమేష్ కు అప్పగించారు. చూశారా ఈ వివక్ష అంటూ కాపుల్లో ఆగ్రహాన్ని రగిలించే ప్రయత్నంలో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* పార్టీని నమ్ముకున్న వారికి..
మరోవైపు తెలుగుదేశం కాపులకు ప్రాధాన్యమిస్తోంది. పార్టీని నమ్ముకున్న కమ్మ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తోంది అంటూ ప్రచారం చేస్తున్నవారు ఉన్నారు. చాలామంది కమ్మ నేతలు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారందరినీ రెచ్చగొట్టే పనిలో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీకైనా కులంతో పని ఉండదు. ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచే వారికి అధినాయకత్వం ప్రాధాన్యం ఇస్తుంది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా గట్టిగానే చెప్పారు. 2019లో ఎందుకు కాపు నేతలు తనను గెలిపించలేదని ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన కాపు నేత జెడి లక్ష్మీనారాయణ ఎందుకు పార్టీలో కొనసాగలేకపోయారని ప్రశ్నించిన సందర్భం కూడా ఉంది. అయితే జేడీ లాంటి వ్యక్తులు పార్టీలో కొనసాగి ఉంటే ఇప్పుడు రాజ్యసభ ద్వారా ఎంపీలు అయి ఉండేవారు. మొన్నటి ఎన్నికల్లో లోక్సభ సభ్యులై ఉండేవారు. వారంతా పవన్ కళ్యాణ్ ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి పార్టీని, అధినేత పవన్ ను నమ్ముకొని పార్టీకి అండదండగా నిలిచిన లింగమనేని రమేష్ లాంటి వ్యక్తులకు పదవులు ఇవ్వడం అంటే తప్పు కాదు కదా? కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ అనవసరం. ఆ పార్టీకి కుల ప్రచారమే రాజకీయ అస్త్రం.
