YSR Congress Party: ఏదైనా ఒక పార్టీకి.. ఒక పదవికి మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తే ఆమోదించాలి. అది రూల్ కూడా. కానీ ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవులకు ఓ ఆరుగురు రాజీనామా చేశారు. కానీ వారి రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు. అయితే వీరితో పాటు రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుల.. రాజీనామాలను ఆమోదించడం.. వారి స్థానంలో కొత్త వారి ఎన్నిక పూర్తి కావడం జరిగిపోయింది. కానీ ఎమ్మెల్సీల రాజీనామా వ్యవహారం మాత్రం తేల్చడం లేదు. దానికి కారణం మండల చైర్మన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడం. ఏడాదిన్నర కిందట ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే ఇంతవరకు ఆమోదానికి నోచుకోకపోవడం చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం వేస్తోంది.
* సహకరించారని వేటు..
2024 ఎన్నికలకు ముందు టిడిపి నేతలకు సహకరించారని చెప్పి విజయనగరం జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రవి రాజు ఫై అనర్హత వేటు వేశారు. చివరకు ఆయన న్యాయస్థానానికి వెళ్లి పదవి కాపాడుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వైసీపీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవిని వదులుకుంటున్నామని… ఇతర పార్టీల్లో చేరిపోయిన ఇంతవరకు రాజీనామాకు ఆమోదం తెలపలేదు. వారు సైతం న్యాయస్థానాలను ఆశ్రయించారు కానీ.. ఎటువంటి ఉపశమనం దక్కలేదు. కోర్టు ఆదేశాలు పాటించడం లేదు మండలి చైర్మన్. విచారణ ప్రక్రియ పేరిట సాగదీస్తున్నారు. అయితే రాజీనామాలు చేసిన వారిని ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలని ఆలోచన చేస్తున్నట్టు ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే జాకియా ఖానం బిజెపిలోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ రాజీనామాను ఉపసంహరించుకున్నారు.
* ఇతర పార్టీల్లో చేరినా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన చాలామంది కూటమి పార్టీల్లో చేరారు. ఎమ్మెల్సీ పదవులను సైతం వదులుకున్నారు. మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయ మంగళం వెంకటరమణ రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లో చేరిపోయారు. అయితే ఇతర పార్టీల్లో చేరిన పర్వాలేదు కానీ ఎమ్మెల్సీలుగా కొనసాగండి అన్నట్టు ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. వాస్తవానికి పార్టీ మారినందుకు వీరందరిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఫిర్యాదు చేయాలి. అయితే మేము రాజీనామా చేసాం మహాప్రభో.. మా రాజీనామాలను ఆమోదించండి అంటూ వేడుకుంటున్న మండలి చైర్మన్ వినిపించుకోవడం లేదు. ఎందుకంటే ఈ ఆరుగురు రాజీనామా చేసిన మరుక్షణం కూటమి పార్టీలో ఈ సంఖ్య చేరిపోతుంది. కూటమి బలం పెంచుకుంటుంది. అదే జరిగితే మండలి చైర్మన్ సీటుకు ఎసరు తప్పదు. అందుకే రాజీనామా చేసిన ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ మరోసారి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కేవలం విచారణ పేరుతో జాప్యం చేయాలన్నదే ప్లాన్ గా తెలిసిపోతోంది.