YSRCP DSC 2025 Allegations: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీ 2025 పై బురద జల్లుతోంది. వ్యతిరేక ప్రచారం చేస్తోంది. మాజీ మంత్రి పేర్ని నాని అయితే పేకాట ఆడే వారిని ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు అని.. స్పోర్ట్స్ కోటాలో పేకాటను చూపారంటూ.. బ్రిడ్జ్ అనే ఆటను ఎత్తిచూపారు. ఇక తక్కువ ర్యాంకు లు వచ్చేవారిని పక్కన పెట్టారని.. ఎక్కువ ర్యాంకులు వచ్చే వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని.. పేపర్ లీకేజీ కి గురైందని.. వెబ్సైట్లో వివరాలు డిలీట్ చేశారని ఇలా ఏవేవో ఆరోపణలు చేస్తున్నారు. అయితే అదంతా ఉత్త ప్రచారం అని తేల్చింది ప్రభుత్వం. విద్యాశాఖ కార్యదర్శి తో పాటు ఉన్నతాధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా సరే వైసిపి వ్యతిరేక ప్రచారం ఆపడం లేదు. అందుకే ఇప్పుడు నేరుగా ఎవరైతే ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారో వారే రంగంలోకి దిగుతున్నారు. సచివాలయం ఉద్యోగ ఎంపికపై కొత్త అంశాన్ని బయటపెడుతున్నారు.
* జిల్లా కమిటీల ఆధ్వర్యంలో..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2019 అక్టోబరు రెండున గాంధీ జయంతి నాడు ఈ ఉద్యోగ నియామకాలను పూర్తి చేశారు. అప్పట్లో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు జరిగాయి. ఎక్కడ కూడా ర్యాంకులు ప్రకటించలేదు. చాలా పోస్టులకు అర్హత సాధించిన వారిని సైతం ఎంపిక చేశారు. ఎందుకంటే అప్పట్లో పోస్టులు మిగిలిపోయాయి. కట్ ఆఫ్ మార్కులు కంటే తక్కువ వచ్చిన వారిని సైతం పిలిచి మరి ఉద్యోగాలు ఇచ్చారు. ఎక్కడ ర్యాంకుల ప్రస్తావన లేదు. ఇప్పుడు అదే అంశాన్ని గుర్తు చేస్తున్నారు డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు. తప్పు మీరు చేసి.. ఇప్పుడు డీఎస్సీ 2025 పై బురద జల్లడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు.
* అడ్డగోలుగా పేర్ని నాని వాగుడు..
ప్రధానంగా మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్ ప్రజల్లోకి తప్పుగా వెళుతున్నాయి. ఒక రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరించిన ఆయన అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. బ్రిడ్జ్ అనే స్పెల్లింగ్ తెలియకుండా కూడా మాట్లాడుతున్నారు. చెస్ అనే మేధో సంపత్తితో కూడిన క్రీడతో బ్రిడ్జి సమానం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆ బ్రిడ్జి అనే అంశాన్ని చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ కోటాలో ఒక్క ఉద్యోగం కూడా నియమించలేదు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ మాత్రం అదే పనిగా ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా పేర్ని నాని కామెంట్స్ ను చదువుకున్నవారు అసహ్యించుకుంటున్నారు. వైసిపి ఆయాంలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు తీయకపోగా.. ఇలా అడ్డగోలు వాదనతో కుట్రలను తెరతీయడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.
* వైసీపీకి సవాల్..
తాజాగా ఎంపికైన ఉపాధ్యాయుల్లో చాలామంది సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నారు. అప్పట్లో సచివాలయ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అటువంటి వారు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఓపెన్ చాలెంజ్ ఇస్తున్నారు. డీఎస్సీ 2025 పై ప్రభుత్వం అన్ని వివరాలు సమర్పించిందని.. సచివాలయ ఉద్యోగుల ఎంపికలో మార్గదర్శకాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బయట పెట్టగలరా అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అసలు ర్యాంకులు, విధి విధానాలంటూ లేకుండా అప్పట్లో సచివాలయ ఉద్యోగ నియామకాలు జరిగాయి అనేది బహిరంగ రహస్యం. కానీ దానిపై టిడిపి అనవసర జోక్యం చేసుకోలేదు. నిరుద్యోగ యువతతో ఆడుకోలేదు. కానీ ఇప్పుడు పారదర్శకంగా జరిగిన డీఎస్సీ 2025 పై కుట్ర చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
