Homeఆంధ్రప్రదేశ్‌YSRCP: ఒకరు వైసీపీని వీడితేనే.. మరొకరికి ఛాన్స్.. నో ఆప్షన్

YSRCP: ఒకరు వైసీపీని వీడితేనే.. మరొకరికి ఛాన్స్.. నో ఆప్షన్

YSRCP: కొన్ని జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వింత పరిస్థితి ఉంది. ఇప్పటికీ నియోజకవర్గాల్లో ఇన్చార్జులు యాక్టివ్ కాలేదు. అది ఆ పార్టీకి చాలా లోటు కూడా. ప్రకాశం జిల్లాలో కీలకమైన చీరాల నియోజకవర్గంలో వింత పరిస్థితి ఉంది. అక్కడ ఇన్చార్జిగా ఉన్న కారణం వెంకటేష్ పెద్దగా క్రియాశీలకంగా లేరు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తిరిగి పార్టీలో చేరుతారన్న ప్రచారం నడుస్తోంది. కరణం బలరాం తో పాటు ఆయన కుమారుడు వెంకటేష్ బయటకు వెళ్ళిపోతే.. వైసీపీలో చేరేందుకు ఆమంచి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కానీ కరణం ఫ్యామిలీ మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతోంది. ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ.. క్రియాశీలకంగా లేరు.

* ఎన్నికలకు ముందే గుడ్ బై..
మొన్నటి ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు ఆమంచి కృష్ణమోహన్. తనకు చీరాల టిక్కెట్ ఇవ్వాలని పట్టు పట్టారు. అందుకు జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదు. పైగా కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు టికెట్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణ మోహన్ కు పాతికవేల వరకు ఓట్లు వచ్చాయి. వెంకటేష్ దారుణంగా ఓడిపోయాడు. అయితే తన కుమారుడు ఓడిపోవడంతో కరణం బలరాం పునరాలోచనలో పడ్డారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ప్రకాశం కేడర్ ఒప్పుకోకపోవడంతో ఆయన చేరిక విషయంలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. అయితే చీరాల నుంచి కరణం ఫ్యామిలీ బయటకు వెళ్ళిపోతే తిరిగి వచ్చేందుకు ఆమంచి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కానీ అందుకు అనుకూల పరిణామాలు చోటు చేసుకోవడం లేదు.

* పట్టున్న నేత..
చీరాలలో మంచి పట్టు ఉంది ఆమంచి కృష్ణమోహన్ కు. తొలిసారిగా ఆయన 2009లో ఎమ్మెల్యే అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో వైసీపీ టికెట్ ఆశిస్తే జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఇవ్వలేదు. దీంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి సత్తా చాటారు. ఎమ్మెల్యేగా గెలవడంతో తెలుగుదేశం అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. అయితే 2019 ఎన్నికలకు ముందు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. కానీ చంద్రబాబు కరణం బలరాంకు టికెట్ ఇవ్వడంతో ఆయన టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమంచి కృష్ణమోహన్ పై గెలిచారు. జగన్ ప్రభంజనంలో సైతం కృష్ణమోహన్ ఓడిపోవడం అప్పట్లో సంచలనం. అయితే టిడిపి నుంచి గెలిచిన కరణం బలరాం తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అది మొదలు కృష్ణమోహన్ వర్సెస్ కరణం బలరాం అన్నట్టు పరిస్థితి మారింది. అయితే టిడిపి నుంచి వైసీపీలో చేరే క్రమంలో కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు జగన్. ఆ హామీ మేరకు కరణం వెంకటేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో విభేదించారు కృష్ణమోహన్. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయి షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఇప్పుడు కరణం వెంకటేష్ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయాడు. బలరాం తన కుమారుడితో టిడిపిలోకి వెళ్లిపోవాలని చూస్తున్నారు. చంద్రబాబు సానుకూలంగా ఉన్న ప్రకాశం జిల్లా క్యాడర్ ఒప్పుకోవడం లేదు. అదే సమయంలో బలరాం వెళ్లిపోతే వైసీపీలోకి వచ్చేందుకు కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. అయితే బలరాం అలానే కొనసాగుతుండడంతో కృష్ణమోహన్ సైతం కాంగ్రెస్లో ఉండిపోవాల్సి వస్తోంది. అయితే దీనిపై ఎప్పటికి స్పష్టత వస్తుందో చెప్పలేం..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version