YSR Congress Survey: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఒక సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఆయన వద్ద ఉంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీం ఒకవైపు సర్వే చేస్తే.. తాను సొంతంగా ఒక సర్వే చేయించుకున్నారట. కానీ అందులో సానుకూల అంశాలు ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు కానీ.. ప్రతికూలతలు అధికంగా ఉన్నట్లు తేలిందట. ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఇంకా ప్రజల్లో భయం ఉందని ఆ సర్వేలో తేలడం సంచలనంగా మారింది. కానీ జగన్ మాత్రం సానుకూలంగానే దానిని తీసుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. వైసిపి దూకుడు కూడా ఆ పార్టీకి నష్టం చేకూరుస్తోందని ఆ సర్వేలో తేలడం విశేషం.
* అవే మైనస్ లు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆందోళనలకు పిలుపునిస్తున్నారు. నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. కానీ వాటిలో జగన్మోహన్ రెడ్డి మాత్రం పాల్గొనడం లేదు. పైగా ఆందోళన కార్యక్రమాలు ఏ అజెండాతో నిర్వహిస్తున్నారో.. కొంతకాలానికి వాటిని అలానే వదిలేస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ అంశాన్ని కూడా అలానే విడిచి పెట్టేసారు. ఇవన్నీ పార్టీకి మైనస్ అవుతున్నట్లు ఆ సర్వేలో తేలిందట. జగన్మోహన్ రెడ్డి స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం.. పక్క రాష్ట్రం నుంచి రాకపోకలు సాగించడం కూడా ఆ పార్టీకి మైనస్. ఇవన్నీ ఆ సర్వేలో తేలినా.. పట్టించుకునే స్థితిలో లేరట జగన్మోహన్ రెడ్డి. అటువంటప్పుడు సర్వేలు చేయడం ఎందుకనేది ఒక ప్రశ్న. అయితే ఆయన చెబుతున్న సర్వరోగ నివారిణి పాదయాత్ర. తను వచ్చే ఏడాదిలో చేసే పాదయాత్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వరూపాన్ని మార్చేస్తుందని ఆయన నమ్మకంతో ఉన్నారట.
* ప్రజల్లోకి వచ్చేది ఎప్పుడు?
ప్రజల మధ్యకు వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేయకపోవడం అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మైనస్ అని ఆ సర్వేలో తేలింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్ముకుంటున్నట్టు ఉంది ఆ పార్టీ. అందుకే నిత్యం వ్యతిరేక ప్రచారం చేస్తోంది. అది కూడా పెద్దగా వర్కౌట్ కావడం లేదని తెలుస్తోంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీం సర్వే చేసిందా? లేకుంటే జాతీయ సంస్థ చేసిందా? అన్నది తెలియడం లేదు. కానీ ఈ సర్వే పూర్తిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా వచ్చినట్లు తెలుస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదట. అటువంటప్పుడు సర్వే చేయించడం ఎందుకు.. దానిని నిర్లక్ష్యం చేయడం ఎందుకు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయట!
