YSR Congress: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి ఒక షాక్ తగలనన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఒకరు బిజెపి గూటికి చేరనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ జూన్లో ఏపీ నుంచి ఓ నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని.. టిడిపికి చెందిన సాన సతీష్ పదవి విరమణ చేయనున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఎంపికయ్యే అవకాశం లేదు. ఎందుకంటే శాసనసభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేదు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పదవీ విరమణ పొందుతున్న వారిలో ఇద్దరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమని ప్రచారం నడుస్తోంది. అందులో ఒకరు బీజేపీ వైపు చూస్తున్నట్లు సమాచారం.
Also Read: ఇక క్వాంటం శకం.. చంద్రబాబు ఆశయం అదే!
* బిజెపిలో చేరికకు..
ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ( Ayodhya Ram Reddy)బిజెపిలో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఆయన స్వతహాగా పారిశ్రామికవేత్త. జగన్మోహన్ రెడ్డి తో వ్యాపారం భాగస్వామి కూడా అని తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయం నుంచి ఆయన జగన్ తోనే ఉన్నారు. ఆయన సోదరుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే గారు రెండుసార్లు వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఇటీవల చంద్రబాబు పై కోర్టులో పిటిషన్లు వేస్తూ వస్తున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. వైసిపి కార్యకలాపాలకు దూరంగా ఉంటూనే ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తూ వచ్చారు. ఆయన సోదరుడు ఆల్ల అయోధ్య రామిరెడ్డి రాజ్యసభకు పదవీ విరమణ చేయనున్నారు. పారిశ్రామికవేత్త కావడం.. దేశవ్యాప్తంగా వ్యాపారాలు ఉండడంతో వాటిని కాపాడుకునేందుకు అయోధ్య రామిరెడ్డి బిజెపిలోకి వెళ్తారని ప్రచారం నడుస్తోంది.
* టిడిపికి దగ్గరయ్యేందుకు..
మరోవైపు పిల్లి సుభాష్ చంద్రబోస్( Pili Subhash Chandra Bose ) తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు బయట ప్రచారం సాగుతోంది. రామచంద్రపురం నియోజకవర్గంలో తలెత్తిన వివాదం వైసీపీలో సెగలు పుట్టిస్తుంది. కొద్ది రోజుల కిందట సుభాష్ చంద్రబోస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ హయాంలో గృహ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు త్వరలో సీఎం చంద్రబాబును కలుస్తానని కూడా ప్రకటించారు. తద్వారా టిడిపిలో చేరికకు సంకేతాలు పంపారు. పదవీ విరమణకు మరో రెండు నెలలు మాత్రమే ఉండడంతో ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. తన కుమారుడు భవిష్యత్తుకు జగన్మోహన్ రెడ్డి భరోసా ఇవ్వకపోవడంతోనే ఆయన కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తారని అనుచరులు భావిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు నేతలు పార్టీని వీడితే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకింగ్ పరిణామమే.
