YSR Congress Egg Puffs Controversy: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీలో ఒక నాయకుడి పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇటీవల ఆ నేతను జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఎప్పుడు జగన్ వెంట ఉండే ఆయన ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. వెళ్లి సొంత నియోజకవర్గంలో పని చేసుకోవాలని సూచించారట. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదట. ఏదైనా అవసరం ఉంటే పిలిపించుకొని మాట్లాడతానని.. అంతవరకు ఇటువైపు రాకూడదని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారట. ఇటీవల ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కామెంట్స్ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసిన సంగతి తెలిసిందే. అయితే సదరు నేత ఈ విషయంలో నోరు తెరవలేదట. రాధాకృష్ణ పై కనీసం విమర్శలు చేయలేదట. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయానికి వచ్చారట. అయితే ఈ ఒక్క కారణంతోనే కాదు గతంలో ఎగ్ పఫ్ ల వ్యవహారం కూడా ఉంది అని తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఐదేళ్ల పాలనలో సీఎంఓలో ఎగ్ పఫ్ ల ఖర్చు రూ.3.6 కోట్లు ఖర్చు చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో సోషల్ మీడియాలో ఇదే హైలెట్ అయింది.
* మారిన భోజనాల కాంట్రాక్ట్..
చిత్తూరు ( Chittoor)జిల్లా నుంచి ఎమ్మెల్యే గా గెలిచిన సదరు నేత తరువాత కీలకంగా వ్యవహరించారు. తరచూ జగన్మోహన్ రెడ్డి వెంట కనిపించేవారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేశారు పక్క జిల్లా నుంచి. కుమారుడు సొంత అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇద్దరూ ఓడిపోయారు. అయితే ఐదేళ్ల వైసిపి పాలనలో మంత్రి కంటే ఎక్కువ హోదాను అనుభవించారు. నిత్యం జగన్మోహన్ రెడ్డి వెంట కనిపించేవారు. అప్పట్లో సీఎంవో కు భోజనాలు అందించే కాంట్రాక్టు వేరే సంస్థ చూసేది. అయితే ఆ భోజనాలు బాగాలేదని చెప్పి సదరు నేత భోజన పంపిణీ బాధ్యతలను తీసుకున్నారు. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో అధికారులు ఆ బాధ్యతను కట్టబెట్టారు. అయితే అప్పటివరకు భోజనం ఖర్చు 200 వరకు ఉండగా.. సదరు నేత వెయ్యి రూపాయలకు పైగా ఒక్కో భోజనానికి చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో అధికారులు ఆ ఖర్చు ఎగ్ పఫ్ల రూపంలో బదలాయించినట్లు తెలుస్తోంది. అలా అప్పట్లో ఎగ్ పఫ్ ల ఖర్చు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డామేజ్ చేసింది. కేవలం సదరు నేత అవినీతితోనే ఇది జరిగిందని జగన్మోహన్ రెడ్డి గుర్తించినట్లు తెలుస్తోంది.
* టిడిపి ఎమ్మెల్యే తో సంబంధాలు..
తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాతో పాటు కొంతమంది టిడిపి ఎమ్మెల్యేలతో సదరునేతకు మంచి సంబంధాలు ఉన్నాయి. మొన్నటి ఆంధ్రజ్యోతి ఎపిసోడ్ లో కనీసం నోరు తెరవలేదు రాధాకృష్ణపై సదరు నేత. పైగా వైసీపీ హయాంలోనే భారీగా యాడ్ల రూపంలో సంస్థకు ప్రకటనలు ఇచ్చారని తెలుస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ పరిణామాలన్నింటినీ గుర్తించి ఇకనుంచి తాడేపల్లి ప్యాలెస్ లో కనిపించవద్దని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఏదైనా అవసరం అనుకుంటే తానే పిలుస్తానని.. అంతవరకు ఇటువైపు రావద్దని కూడా ఆదేశించినట్లు ప్రచారం నడుస్తోంది. మొత్తానికైతే ఎగ్ పఫ్ లు ఆ వైసిపి నేత కొంపముంచాయి.