YS Rajasekhara Reddy impact on YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో సరికొత్త ఆందోళన ప్రారంభం అయింది. కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన జరుపుతుండటమే కారణం. పునర్విభజనతో ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు.. 263 కు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు పార్లమెంటు స్థానాలు 25 నుంచి 38 వరకు పెరిగే ఛాన్స్. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఇప్పటినుంచి లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నియోజకవర్గాల పునర్విభజన అనేది టిడిపి కూటమికి ఒక బ్రహ్మాస్త్రం. నియోజకవర్గాల సరిహద్దులను మార్చే క్రమంలో.. అధికార పార్టీల అభీష్టానికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ లెక్కన కేంద్రంలోనూ ఎన్డీఏ ఉంది. రాష్ట్రంలో అనుబంధ కూటమి ఉంది. కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గాలపై కూటమి ఫోకస్ పెడుతుంది. రాజకీయంగా అది కనిపిస్తున్న దృశ్యమే.
నాడు కాంగ్రెస్ కు అనుకూలంగా
2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో డీ లిమిటేషన్( delimitation ) ప్రక్రియ గుర్తుకు తెచ్చుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నిద్ర పట్టడం లేదు.. నాడు కాంగ్రెస్ పార్టీకి డీ లిమిటేషన్ ఎంత మేలు చేసిందో.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సైతం అదే పరిస్థితి ఉంటుందన్న అంచనాకు వచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలను ముక్కలు చేయడం ద్వారా.. సామాజిక రిజర్వేషన్లను మార్చడం ద్వారా బలహీనపరిచే ప్లాన్లను అమలు చేయవచ్చు. కేవలం నియోజకవర్గాల హద్దులను మార్చడమే కాదు. మహిళా రిజర్వేషన్లు, ఎస్సీ / ఎస్టి రిజర్వ్డ్ కోట కింద కు కీలక స్థానాలు తీసుకురావడం ద్వారా ప్రత్యర్థ్ పార్టీ ముఖ్య నేతల గెలుపు అవకాశాలను దెబ్బతీయవచ్చు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గాన్ని మహిళలకు రిజర్వేషన్ కట్టబెడితే ఆయన పోటీ చేసే అవకాశం కోల్పోయినట్టే.
Also Read: ఏపీలో గుండెలు పగిలే విషాదం.. తెల్లారేలోగానే పదిమంది సజీవ దహనం
అప్పట్లో బలమైన టిడిపి నేతలు టార్గెట్
అప్పట్లో రాజశేఖర్ రెడ్డి చాలామంది పెద్ద నేతలను టార్గెట్ చేశారు. ఉత్తరాంధ్రలో ఎర్రం నాయుడు, కళా వెంకట్రావు కుటుంబాలకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది డీ లిమిటేషన్. వారే కాదు రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో చంద్రబాబు సన్నిహిత నేతలు రాజకీయంగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కచ్చితంగా పునర్విభజన ద్వారా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే నేతల నియోజకవర్గాలను టార్గెట్ చేస్తారు. ఇప్పుడు వైసీపీ ముఖ్యనేతల భయం కూడా అదే. గత రెండు రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శిబిరంలో టెన్షన్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది.
చంద్రబాబుకు చక్కటి అవకాశం..
రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు( CM Chandrababu) అందివేసిన చేయి. కచ్చితంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియను కూటమికి అనుకూలంగా మార్చుకోగలరు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయగలరు. ఎప్పుడు అయితే నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరపైకి వచ్చిందో.. అప్పటినుంచి ఒక రకమైన ఆవేదనలో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. తప్పకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూలాలను దెబ్బతీస్తారన్న సమాచారం వారికి ఉంది. నాడు రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన వ్యవహారం వైసీపీ నేతలకు తెలుసు. అందుకే వారికి కంటిమీద కునుకు లేదు.