YS Jagan new case: ఏపీ ( Andhra Pradesh) రాజకీయాల్లో సంచలనం సృష్టించింది రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసు. ప్రస్తుతం ఈ కేసు విచారణ శరవేగంగా సాగుతోంది. విజయనగరం ఎస్పీ దామోదర్ నేతృత్వంలో బృందం విచారిస్తోంది. గత రెండు రోజులుగా విజయనగరంలోని పోలీస్ స్టేషన్లో ఈ కేసులో సంబంధం ఉన్న వారిని విచారణ చేపడుతున్నారు. రఘురామకృష్ణం రాజును అరెస్టు చేసిన అప్పటి ఏ ఎస్ పి విజయ పాల్, డిఐజి స్థాయి అధికారి సునీల్ నాయక్ విచారణ పూర్తయింది. మరోవైపు బోరుగడ్డ అనిల్ కుమార్, అప్పటి సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ లకు సైతం నోటీసులు జారీ చేశారు. వారు సైతం విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మొత్తం పరిస్థితి చూస్తుంటే మాత్రం ఈ కేసు క్లైమాక్స్ కు వచ్చినట్లు కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ కేసు విచారణ వేగవంతం అయ్యింది. మరోవైపు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
అప్పట్లో రాజద్రోహం కేసు..
2019లో వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress) పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు రఘురామకృష్ణంరాజు. కొద్ది రోజులకే ఆ పార్టీకి దూరమయ్యారు. అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేసేవారు. ఈ క్రమంలో రఘురామకృష్ణం రాజు పై దేశద్రోహం కేసు నమోదయింది. పుట్టినరోజు నాడే ఆయనను హైదరాబాదులో అరెస్టు చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. కస్టడీలో ఆయనపై దాడి జరిగినట్లు అప్పట్లో బాధితుడుగా ఉన్న రఘురాం కృష్ణంరాజు ఆరోపించారు. హైదరాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ఆయనకు పరీక్షలు చేసి కస్టడీలో దాడి చేసినట్లు నిర్ధారణ చేశారు. కోర్టు ఆదేశాలతో ఆ కేసు నుంచి బయటపడ్డారు రఘురామ కృష్ణంరాజు. కానీ అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో కేసు ముందుకు సాగలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి.. రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే దేశద్రోహం కేసు పెట్టారని.. కస్టడీలో వారి కళ్ళల్లో ఆనందం చూసేందుకు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పట్లో గుంటూరు ఎస్పీగా ఉన్న దామోదర్ నేతృత్వంలో కేసు విచారణ ప్రారంభమైంది. దాదాపు ఈ కేసు విచారణ ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.
సునీల్ నాయక్ ఫిర్యాదుతో..
రఘురామకృష్ణం రాజు పై ( Raghuram Krishnam Raju) అప్పట్లో సిఐడి అధికారిగా ఉన్న సునీల్ నాయక్ చేసిన ఫిర్యాదు మేరకు రాజ ద్రోహం కేసు నమోదయింది. ఆయన ఇప్పుడు విచారణకు హాజరై కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. అప్పటి సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ కను సన్నల్లోనే జరిగిందని ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రఘురామ అరెస్టు ప్రక్రియ ఇప్పుడు ఇరకాటంలో నెట్టింది అధికారులకు. ఒక ఎంపీ ని మరో రాష్ట్రంలో అరెస్టు చేసినప్పుడు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి.. ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలనే కనీస నిబంధన అప్పట్లో పాటించలేదు. వారెంట్ లేకుండానే 400 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయించడం.. ఆపై గుంటూరు సిఐడి కార్యాలయంలో భౌతిక దాడులకు పాల్పడడం వంటి వాటిపై ఆధారాలను సేకరించారు విచారణ అధికారులు. కస్టడీలో ఉన్నప్పుడు జరిగిన దాడికి సంబంధించి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి ఇచ్చిన మెడికల్ రిపోర్టులు ఇప్పుడు.. కేసులో అత్యంత కీలక సాక్షాలుగా మారాయి.
ఏ 1 గా జగన్మోహన్ రెడ్డి
మరోవైపు అప్పటి ప్రభుత్వ పెద్దల కళ్ళల్లో ఆనందం చూసేందుకే సిఐడి అధికారులు రాజద్రోహం కేసు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ కేసులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏ1 గా చేర్చడంతో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. అప్పటి ఎంపీపై వ్యక్తిగత కక్షతోనే ఈ కుట్రపన్నారని.. ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా సిఐడి చీఫ్ స్థాయి అధికారి ఇంత సాహసం చేయలేరని దర్యాప్తు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే అప్పటి సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ కు నోటీసులు ఇచ్చారు. ఆయన నుంచి సహకరించిన వివరాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఇదే ప్రకంపనలకు కారణం అవుతోంది.