YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. సమర్థవంతమైన నేతలను బరిలోదించడం ద్వారా అధికారం చేజిక్కించుకోవచ్చు అని భావిస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంటు స్థానాలపై గురిపెట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి చక్కని ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. ప్రధానంగా ఆయన విజయవాడ పార్లమెంట్ స్థానంపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి మూడు ఎన్నికలు జరిగాయి. కానీ ఒక్కసారి కూడా అక్కడ గెలవలేదు. ఎన్ని రకాల ప్రయోగాలు చేసిన ఫలించలేదు. అందుకే ఈసారి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని ముందే ఆలోచన చేస్తున్నారు. ముగ్గురు పేర్లను పరిశీలిస్తున్నారు.
* ఎన్నో రకాల ప్రయోగాలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత 2014లో ఒక సినీ నిర్మాతకు అవకాశం ఇచ్చారు. 2019లో మరో పారిశ్రామికవేత్తకు ఛాన్స్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో టిడిపిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ కేసినేని నానిని తెచ్చి టికెట్ ఇచ్చారు. అప్పుడు కూడా ఓటమి తప్పలేదు. అందుకే ఈసారి ముందుగా ఒక నేతకు ఎంపిక చేసి పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించేందుకు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అధికం. అందుకే ఆ సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నాయకుడిని బరిలోదించాలని చూస్తున్నట్లు సమాచారం.
* కొడాలి నాని కి ఆదేశం..
ప్రధానంగా మాజీ మంత్రి కొడాలి నానిని ఎంపీగా పోటీ చేయాలని జగన్ ఆదేశించినట్లు ప్రచారం సాగుతోంది.. 2004 నుంచి 2019 వరకు వరుసగా గెలుస్తూ వచ్చారు కొడాలి నాని ఎమ్మెల్యేగా. రెండుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. మరో రెండు సార్లు వైసీపీ తరఫున విజయం సాధించారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం వెనిగండ్ల రాము చేతులు ఓడిపోయారు. ప్రస్తుతం రాము గుడివాడలో దూసుకుపోతున్నారు. అందుకే అక్కడ ప్రత్యామ్నాయ నేతకు అవకాశం కల్పించి కొడాలి నానికి ఎంపీగా ఛాన్స్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ కొడాలి నాని మాత్రం అందుకు విముఖత చూపుతున్నట్లు సమాచారం.
* వంశీ లేదా అవినాష్..
మరోవైపు వల్లభనేని వంశీ మోహన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. గన్నవరం నుంచి రెండుసార్లు గెలిచారు వల్లభనేని వంశీ. 2014లో తొలిసారి గెలిచారు. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం నిలబడ్డారు. అయితే వైసిపి రావడంతో ఆ పార్టీలోకి ఫిరాయించారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. అయితే ఎంపీగా పోటీ చేయాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. 2009లో టిడిపి అభ్యర్థిగా విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అనుభవం ఉంది వంశీకి. అయితే ఎంపీగా పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. మరోవైపు యువనేత దేవినేని అవినాష్ ను సైతం ఎంపీగా పోటీ చేయాలని జగన్ సూచించగా అందుకు ఆయన సైతం విముఖంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ ముగ్గురు నేతల్లో ఎవరో ఒకరు ఎంపీగా పోటీ చేయడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
