Kethireddy Venkatarami Reddy
Kethireddy Venkatarami Reddy: వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో నెంబర్ 2 స్థానాన్ని కూడా వదులుకున్నారు. వైసీపీతో పాటు రాజ్యసభ పదవికి సైతం రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా వెనుక రకరకాల చర్చ నడుస్తోంది. సరికొత్త విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. వైసీపీ నేతలు మూడు రోజుల తర్వాత స్పందిస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి పై మాత్రం నేరుగా విమర్శలు చేయడం లేదు. కూటమి నేతలు మాత్రం విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ వ్యూహంలో భాగంగానే ఇదంతా జరుగుతోందని ఆరోపిస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి మాత్రం తాను ఏ పార్టీలో చేరడం లేదని.. వ్యవసాయంపై తనకు ఆసక్తి ఉందని.. ఇకనుంచి అదే పని చేస్తానని చెబుతున్నారు. అయితే తన రాజీనామా కూటమికి ప్రయోజనమని విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్య వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. కూటమికి ప్రయోజనం చేకూర్చేందుకే విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నారా? అన్న చర్చ నడుస్తోంది. సాయి రెడ్డి వెనుక జగన్ అయినా ఉండాలి.. బిజెపి అయినా రాజకీయం చేసి ఉండాలి అన్న టాక్ నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైసీపీ కీలక నేతగా ఉన్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి( Venkat Rama Reddy ) బాంబు పేల్చారు. సంచలన కామెంట్స్ చేశారు.
* పార్టీ నియామకాలపై అసంతృప్తి
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ( North Andhra)పార్టీ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. చాలా రోజులపాటు ఆ పదవిలో కొనసాగారు. సరిగ్గా ఎన్నికల ముందు ఆ బాధ్యతల నుంచి విజయసాయిరెడ్డిని తప్పించారు జగన్. ఆ స్థానంలో తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి నియమించారు. అప్పట్లో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విజయసాయిరెడ్డి పై ఫిర్యాదులు చేయడంతోనే మార్చారన్న కామెంట్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు విజయసాయిరెడ్డి. అయితే విజయసాయిరెడ్డి అప్పటివరకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగారు. కానీ ఆయనను తొలగించి వైవి సుబ్బారెడ్డి కి ఆ బాధ్యతలు అప్పగించారు జగన్. అలాగే వైవి సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర సమన్వయకర్త పదవి నుంచి తొలగించి ఆ బాధ్యతలు విజయసాయిరెడ్డికి ఇచ్చారు. ఇక్కడే తేడా కొట్టిందని అంచనా వేస్తున్నారు కేతిరెడ్డి. ఈ మార్పు విజయసాయి రెడ్డికి ఇష్టం లేకుండా పోయిందని.. అందుకే రాజీనామా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
* బిజెపి హస్తం
మరోవైపు విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) రాజీనామా వెనుక బిజెపి ఉందన్న అనుమానాన్ని కూడా కేతిరెడ్డి వ్యక్తం చేశారు. ఇతర పార్టీల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలపై కేంద్రం ఈడీతో పాటు సిబిఐ ని ప్రయోగిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు కేతిరెడ్డి. అందుకు విజయసాయిరెడ్డి అతీతులు కూడా కాదన్నారు. కాకినాడ పోర్టు వాటాల బదలాయింపు కూడా ప్రభావం చూపి ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఇదే విషయంపై విజయసాయిరెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటే బలహీనుడు అవుతానని.. అటువంటప్పుడు తనపై కేసులు ఎందుకు నీరు గారుతాయని ప్రశ్నించారు. అయితే బిజెపి జగన్ ను టార్గెట్ చేసే క్రమంలో విజయసాయిరెడ్డి పై ఫోకస్ పెట్టిందన్న విషయాన్ని కేతిరెడ్డి బయట పెట్టారు. మొత్తానికి అయితే కేతిరెడ్డి ఏకకాలంలో రెండు విషయాలను బయటపెట్టారు. ఒకటి వైసీపీలో నియామకాలతో విజయసాయిరెడ్డి అసంతృప్తికి గురయ్యారని… రెండోది ఏపీలో వైసీపీని టార్గెట్ చేస్తూ బిజెపి ఆపరేషన్ ప్రారంభించిందని అనుమానం వచ్చేలా మాట్లాడారు.
* ఇప్పుడిప్పుడే ఫుల్ క్లారిటీ
అయితే ఇప్పుడిప్పుడే విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారం వెనుక ఫుల్ క్లారిటీ వస్తోంది. వైసిపి అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన తన విషయంలో జగన్( Jagan Mohan Reddy) చేస్తున్న వైఖరిపై విజయసాయిరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. అదే అసంతృప్తిని బిజెపి క్యాష్ చేసుకుంది. విజయసాయిరెడ్డిని వైసీపీ నుంచి బయటకు రప్పించగలిగింది. జగన్ ఆత్మస్థైర్యం పై దెబ్బకొట్టగలిగింది. అయితే తొలుత విజయసాయిరెడ్డి రాజీనామా పై మాట్లాడేందుకు వైసిపి నేతలు ముందుకు రాలేదు. కానీ ఇప్పుడిప్పుడే నేతలు ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అలాగని విజయసాయి రెడ్డి పై విమర్శలు చేయడం లేదు. సానుభూతి వ్యక్తం చేస్తూనే అందుకు గల కారణాలను బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే విదేశాల్లో ఉన్నారు అధినేత జగన్. మరి ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.