Vijayawada : వెంటాడి వేటాడి అత్తను చంపేశాడు.. కారణం అదే

అయితే తన భార్య కాపురానికి రాకపోవడానికి, విడాకులకు అత్తమామలే కారణమని రాజేష్ భావించాడు. ఎలాగైనా వారిద్దర్నీ మట్టుబెట్టేందుకు డిసైడయ్యాడు. హత్యకు వ్యూహరచన చేశాడు. కానీ అత్తను మాత్రమే హతమార్చగలిగాడు.

Written By: Dharma, Updated On : June 25, 2023 1:07 pm
Follow us on

Vijayawada : కుటుంబ వివాదాల్లో చిక్కుకొని కొంతమంది విచక్షణ కోల్పోతున్నారు. క్షణికావేశంతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో పిల్లనిచ్చిన అత్తనే ఓ వ్యక్తి దారుణంగా హత్యచేశాడు. వెంటాడి వేటాడి చంపేశాడు. మామ తృటిలో ప్రమాదం నుంచి  తప్పించుకున్నాడు. ప్రాణభయంతో పరుగులు తీశాడు.విజయవాడలో వెలుగుచూసింది ఈ ఘటన. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపైనే ఘటన జరిగింది. సర్వత్రా ఆందోళన కలిగించింది.
విజయవాడ వైఎస్సార్ కాలనీకి చెందిన గోగుల గురుస్వామి, నాగమణి దంపతులు శనివారం రాత్రి బైక్ పై వెళుతుండగా  వారి అల్లుడు రాజేష్ వెంబడించాడు. సరిగ్గా చనుమోలు వెంకటరావు వద్ద వారి వాహనం నెమ్మదించాడు. దీంతో తన వెంట తెచ్చుకున్న కొబ్బరిబొండాల కత్తితో నాగమణిపై దాడి చేయడంతో ఆమె చేయి తెగిపడింది. బైక్ పై నుంచి ఆమె జారిపడింది. దీంతో ఆమె మెడపై విచక్షణారహితంగా పొడవడంతో ఘటనాస్థలంలోనే మృతిచెందింది. తరువాత మామ గురుస్వామిని చంపేందుకు రాజేష్ ప్రయత్నించగా.. ఆయన ప్రాణభయంతో పరుగులు తీశాడు. దొరక్కుండా తప్పించుకున్నారు. రాజేష్ అక్కడ నుంచి బైక్ పై పరారయ్యాడు. ఈ హఠాత్ పరిణామంతో అటువైపుగా వెళుతున్న వారు భయాందోళనకు గురయ్యారు.
గురుస్వామి కుటుంబం వైఎస్సార్ కాలనీ బ్లాక్ నంబర్ 68లో నివాసముంటుంది. భార్య నాగమణితో పాటు ఝాన్సీ, లలిత, మణి అనే ముగ్గురు సంతానం ఉన్నారు. ఇందులో రెండో కుమార్తె లతకు 15 ఏళ్ల కిందట ఏకలవ్యనగర్ కు చెందిన కుంభా రాజేష్ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. రాజేష్ ఫుడ్ కోర్టులో వంట పనిచేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా రాజేష్, లలిత దంపతుల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. మనస్పర్థలతో విడాకులు తీసుకోవాలని భావించారు. కొద్దిరోజుల్లో కోర్టులో వాయిదా రానుంది. ఈ వాయిదాతో విడాకులు వస్తాయని అంతా భావిస్తున్నారు. అయితే తన భార్య కాపురానికి రాకపోవడానికి, విడాకులకు అత్తమామలే కారణమని రాజేష్ భావించాడు. ఎలాగైనా వారిద్దర్నీ మట్టుబెట్టేందుకు డిసైడయ్యాడు. హత్యకు వ్యూహరచన చేశాడు. కానీ అత్తను మాత్రమే హతమార్చగలిగాడు. మామ గురుస్వామి ప్రాణాలను కాపాడుకున్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.