Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి బలమైన ప్రాంతం రాయలసీమ. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి రాయలసీమ అండగా నిలుస్తూ వస్తోంది. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం దారుణంగా ఓడిపోయింది. కేవలం ఏడు చోట్ల మాత్రమే ఆ పార్టీ గెలిచింది. అది కూడా కడపలో నాలుగు సీట్లు, చిత్తూరులో రెండు చోట్ల మాత్రమే గెలవగలిగింది. అయితే రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవడం, అనుకున్న స్థాయిలో రాయలసీమను అభివృద్ధి చేయకపోవడం అంత వ్యతిరేకతకు కారణం అయ్యింది. అయితే రాయలసీమలో బలపడాలని జగన్మోహన్ రెడ్డి గట్టి ప్లాన్ తో ఉన్నారు. అందుకే ఇప్పుడు రాయలసీమలో ఉద్యమ బాట పట్టాలని నిర్ణయించారు. రేవంత్ రెడ్డితో చంద్రబాబు రహస్య ఒప్పందం మూలంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేశారని.. సాక్షాత్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో.. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పడుతోంది. అయితే దీనికి రాయలసీమ ప్రజలు ఎంతవరకు మద్దతు ఇస్తారో చూడాలి.
* టిడిపికి ప్రతికూలం
వాస్తవానికి తెలుగుదేశం( Telugu Desam) పార్టీ ఆవిర్భావం నుంచి రాయలసీమ ప్రాంతంలో ఆ పార్టీకి ఏకపక్ష విజయం దక్కలేదు. రాయలసీమ ప్రాంతంలో 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్టీఆర్ హయాంలో సైతం ఆ పార్టీకి 25 నుంచి 30 స్థానాలు లోపు మాత్రమే లభించేవి. కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా అక్కడ ప్రభావం చూపేది. ఆ పార్టీ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం అధికంగా కనిపించింది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ రాయలసీమలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. 2019లో అయితే మూడు స్థానాలు తప్పించి మిగతా 49 స్థానాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డాయి. అటువంటి చోట మొన్న తెలుగుదేశం కూటమి 45 స్థానాలను కైవసం చేసుకుంది. రాయలసీమ ప్రజలు దారుణంగా తిరస్కరించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని.
* ఆ సామాజిక వర్గం దూరం.. రాయలసీమలో( Rayalaseema) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దెబ్బ తినడానికి ప్రధాన కారణం రెడ్డి సామాజిక వర్గం. బీసీలను టార్గెట్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి అక్కున చేర్చుకున్న రెడ్డి సామాజిక వర్గం దీనిని జీర్ణించుకోలేకపోయింది. అందుకే మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిలిచింది. దీంతో జగన్మోహన్ రెడ్డికి దారుణ పరాజయం తప్పులేదు. అయితే ఇప్పుడు దాని నుంచి గుణపాటాలు నేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో జరిగిన పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే నిలిచిపోయింది. దానికి సక్రమంగా అనుమతులు తీసుకోకపోవడంతో అప్పట్లో తెలంగాణ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దీంతో కేంద్రం అనుమతులు నిలిపివేసింది. కానీ ఇప్పుడు అదే ప్రాజెక్టును చంద్రబాబు నిలిపివేస్తారంటూ వైసీపీ ఆందోళనలు మొదలుపెట్టింది. ఈ అంశంతో బలపడాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో. అయితే కార్యక్రమానికి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. తద్వారా రాయలసీమలో వైసిపి బలం తగ్గలేదని నిరూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇవి రాయలసీమలో పట్టు సాధించేందుకు ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.