YSR Congress Caste Politics: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ కాపులపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో కాపుల విషయంలో లైట్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. దానికి భారీ మూల్యమే చెల్లించుకున్నారు. పవన్ కళ్యాణ్ రూపంలో కాపులు కూటమివైపు టర్న్ అవుతున్నట్లు సంకేతాలు వచ్చాయి. కానీ బీసీలతో పాటు ఇతర సంప్రదాయ ఓటు బ్యాంకుతో మరోసారి అధికారంలోకి రావచ్చు అని జగన్మోహన్ రెడ్డి అంచనా వేశారు. కానీ ఆయన ఆలోచన, అంచనా తప్పింది. కూటమి ఏకపక్షంగా విజయం సాధించింది. కాపుల ప్రాబల్యం ఉన్న గోదావరి జిల్లాలో అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకునేందుకు కూడా ఇబ్బంది పడింది. అయితే ఎన్నికల ఫలితాలు తర్వాత కాపుల విషయంలో తమ పార్టీకి భారీ డామేజ్ జరిగిందని గుర్తించారు జగన్మోహన్ రెడ్డి. అందుకే దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలితో కాపులు ఆ పార్టీకి మరింత దూరం అవుతున్నారు తప్ప.. ఎంత మాత్రం దగ్గర కావడం లేదు.
* వైసిపి కోసమే ఉద్యమం..
ముద్రగడ పద్మనాభం( mudragada Padmanabham ) ద్వారా మళ్లీ కాపు రాజకీయం చేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గతంలో ఇదే టిడిపి ప్రభుత్వాన్ని అధికారం నుంచి దూరం చేయడంలో ముద్రగడ కీలక పాత్ర పోషించారు. 2014 ఎన్నికల్లో కాపు రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం పోరాట బాట పట్టారు. ఈ క్రమంలో అప్పట్లో ఉద్యమం హింసాత్మక ఘటనలకు దారితీసింది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పై కాపుల్లో ఆగ్రహానికి కారణం అయింది. అప్పటి సీఎం చంద్రబాబు కాపులకు ఈ బీసీ రిజర్వేషన్లు ఇచ్చారు. అయినా సరే కాపుల్లో ఆగ్రహం చల్లారలేదు. టిడిపి పై ఉన్న కోపంతో కాపులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. ఆ విధంగా ముద్రగడ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా లబ్ధి చేకూర్చారు. అయితే అదే ముద్రగడ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రిజర్వేషన్ ఉద్యమాన్ని ఉన్నఫలంగా నిలిపివేశారు. అయితే అప్పటివరకు ఆయన పై ఉన్న గౌరవం.. ఉద్యమం నిలిపివేతతో లేకుండా పోయింది.
* ఎన్నెన్నో ఘటనలు..
ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో కాపులను టార్గెట్ చేసుకుని ఎన్నో ఘటనలు జరిగాయి. దానికి విసుగు చెంది కాపులు కూటమికి టర్న్ అయ్యారే తప్ప.. మరో కారణం కాదు. వైసిపి హయాంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి మెచ్చుకుంటూ ముద్రగడ లేఖలు రాసేవారు. చంద్రబాబుతో పాటు పవన్ కు వ్యతిరేక వైఖరితో లేఖలు రాసేవారు. ఇలా ముద్రగడలో జగన్ ఫేవర్ విపరీతంగా కనిపించేది. అయితే ఇప్పుడు అదే ముద్రగడ వివాదాస్పద ముద్ర కలిగిన అంబటి రాంబాబు విషయంలో రాజకీయం చేయడం ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు కాపుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి అంబటి రాంబాబుకు. అటువంటి వ్యక్తిని కాపు సామాజిక వర్గాన్ని లింకు చేసుకొని ముద్రగడ మాట్లాడడం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది.
* పవన్ పై నోరు పారేసుకున్నప్పుడు..
వైసిపి హయాంలో పవన్ కళ్యాణ్ ను( deputy CM Pawan Kalyan) టార్గెట్ చేయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు లేరు. పోసాని కృష్ణ మురళి అయితే పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన కుటుంబం పై కూడా తిట్ల దండకం అందుకున్నారు. ఇంట్లో ఆడవారిని సైతం ప్రస్తావిస్తూ లేనిపోని మాటలు అన్నారు. ఆయన ఒక్కరే కాదు ప్రతి ఒక్కరూ ఆయన వ్యక్తిగత జీవితం పై మాట్లాడారు. కానీ ముద్రగడ పెద్దమనిషి పాత్రలో ఉంటూ ఒక్కసారి కూడా ఖండించలేదు. ఇవన్నీ కాపులకు తెలుసు. ఇప్పుడు కొత్తగా ముద్రగడ ద్వారా జగన్మోహన్ రెడ్డి కాపు రాజకీయం చేయాలని చూస్తున్నారు. అది ఎంత మాత్రం వర్కౌట్ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.