Chadrababu – ABN Radhakrishna : చంద్రబాబు అంటే రాధాకృష్ణకు ఎందుకు అంత ఇష్టం?

అందుకే చంద్రబాబు క్యాంపులో అత్యంత కీలకమైన వ్యక్తిగా మారిపోయాడు. ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి మరోసారి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసేందుకు పసుపు కంకణం కట్టుకున్నాడు

Written By: NARESH, Updated On : June 19, 2023 4:20 pm
Follow us on

Chadrababu – ABN Radhakrishna : మిగతా వారి విషయంలో ఎలా ఉన్నప్పటికీ.. చంద్రబాబు ప్రస్తావన వస్తే రాధాకృష్ణ తన ఒంటికి పసుపురంగు వేసుకుంటాడు. పోతు రాజు మాదిరి చర్నా కోల్ దెబ్బలు కొట్టుకుంటూ పసుపు రాగం ఆలపిస్తాడు. వాస్తవానికి చంద్రబాబుతో వేమూరి రాధాకృష్ణ దోస్తీ ఈనాటిది కాదు.. గతంలో ఆయన ఆంధ్రజ్యోతి పత్రికలో రాధాకృష్ణ స్టేట్ బ్యూరోలో పనిచేసేవాడు. ఆంధ్ర నేపథ్యం అయినప్పటికీ నిజామాబాద్ జిల్లాలో అతని పూర్వీకులు స్థిరపడ్డారు. తర్వాత జర్నలిజం మీద మక్కువతో రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రికలో చేరాడు. కమ్మ సామాజిక నేపథ్యం కావడంతో తొందరగానే ఆయనకు టిడిపి స్టేట్ బ్యూరో చూసే అవకాశం దక్కింది. ఇదే సమయంలో మండవ వెంకటేశ్వరరావు దగ్గర నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వరకు పరిచయాలు ఏర్పడ్డాయి. పరిచయాలు కాస్త అరేయ్, ఒరేయ్ అనే దాకా ఎదిగాయి.

-చంద్రబాబు సహాయం

లక్ష్మీపార్వతి ఎపిసోడ్లో కొద్దో గొప్పో రాధాకృష్ణకు కూడా పైకం ముట్టింది అని సర్కిల్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది.. ఆ డబ్బుతోనే ఆయన మూతపడిన ఆంధ్రజ్యోతిని కొనుగోలు చేశాడని, పత్రికను పున: ప్రారంభించాడని అంటూ ఉంటారు. చంద్రబాబు సహకరించడంతో ఆ పత్రిక ఆనతి కాలంలోనే వృద్ధి బాట పట్టిందని చెబుతూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ బీట్ చూస్తున్నప్పుడు చంద్రబాబు అక్కున చేర్చుకున్నారని, పలు ప్రయోజనాలు కల్పించారనే ప్రచారం లేకపోలేదు. తనకు కల్పించిన మేళ్ళ వల్లే చంద్రబాబుకు రాధాకృష్ణ నమ్మిన బంటు లాగా ఉంటాడని పూర్వపు జర్నలిస్టులు అంటూ ఉంటారు.

వైయస్ ను సైతం ధిక్కరించాడు

వైయస్ రాజశేఖర్ రెడ్డి 2003లో చేపట్టిన పాదయాత్రకు రాధాకృష్ణ విపరీతమైన కవరేజీ ఇచ్చాడు.. అప్పట్లో చంద్రబాబుతో కొంతమేర గ్యాప్ వచ్చిందని, అందువల్లే వైయస్ అనుకూల వార్తలు రాశాడని అంటారు. తర్వాత ఇద్దరి మధ్య సయోధ్య కుదరడంతో మళ్లీ వైయస్ మీద రాధాకృష్ణ యుద్ధం ప్రకటించాడని చెబుతూ ఉంటారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివిధ పథకాల్లో జరిగిన అవకతవకల మీద రాధాకృష్ణ తన పత్రికలో విపరీతమైన వార్తలు ప్రచురించాడు. ఈనాడుతో పోటీగా వైయస్ రాజశేఖర్ రెడ్డి మీద వార్తలు రాయడంతో.. ఆయన ఏకంగా నిండు సభలో ఆ రెండు పత్రికలు అని ప్రస్తావించారు. ఇక చంద్రబాబుకు సంబంధించి విపరీతమైన కవరేజ్ ఇచ్చే ఆంధ్రజ్యోతి.. ప్రతిపక్షాల విషయంలో ముఖ్యంగా జగన్ కు సంబంధించి ప్రతికూల వార్తలు రాస్తుంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించినప్పుడు చిరంజీవి మీద విష ప్రచారానికి దిగింది. చంద్రబాబు ఓటమికి ఆయనే కారకుడు అని ఆరోపించింది. రెండోసారి వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రావడంతో రాధాకృష్ణ ఒకింత వెనకడుగు వేశాడు. కానీ చంద్రబాబు ప్రయోజనాల విషయంలో మాత్రం తగ్గలేదు.

చారిత్రాత్మక అవసరం

2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్ చారిత్రాత్మక అవసరం అని చెప్పిన రాధాకృష్ణ.. 2019లో ఓడిపోతే మాత్రం అది ఓటర్ల తప్పు అని తేల్చేశారు. చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడటం లో రాధాకృష్ణ తర్వాతే ఎవరైనా. ఈనాడు రామోజీరావు కూడా చేతకాని దౌత్యాన్ని రాధాకృష్ణ నెరప గలడు.. అందుకే చంద్రబాబు క్యాంపులో అత్యంత కీలకమైన వ్యక్తిగా మారిపోయాడు. ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి మరోసారి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసేందుకు పసుపు కంకణం కట్టుకున్నాడు. 2019లో ఇదే తీరుగా వ్యవహరించడంతో జనాల్లో ఏవగింపు మొదలై 23 స్థానాలకు చంద్రబాబును పరిమితం చేశారు. ఈసారి కూడా తామే అధికారంలోకి వస్తామని జగన్ చెబుతున్నారు. ఈ సమయంలో రాధాకృష్ణ ఏం చేస్తాడో వేచి చూడాల్సి ఉంది.