BJP – Purandeshwari : ఎన్టీఆర్ కుమార్తె  పురంధేశ్వరికి బీజేపీ పగ్గాలు ఎందుకు ఇచ్చింది?

బీజేపీ అగ్రనాయకత్వం ఏకంగా రాష్ట్ర పగ్గాలనే అప్పగించింది. పొత్తు ఉన్నా, లేకపోయినా టీడీపీకి ధీటైన నాయకత్వాన్ని తయారుచేయాలన్న ఉద్దేశ్యంతోనే బీజేపీ హైకమాండ్ ఒక వ్యూహం ప్రకారం నడుచుకున్నట్టు పురంధేశ్వరి నియామకంతో తేటతెల్లమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Written By: Dharma, Updated On : July 4, 2023 6:03 pm
Follow us on

BJP – Purandeshwari : ఏపీ బీజేపీ పగ్గాలు పురంధేశ్వరికి ఇవ్వడం వెనుక హైకమాండ్ వ్యూహమేంటి? కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆమెకు అనూహ్యంగా పదవి ఏమిటి? ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చనీయాంశంగా మారింది. సుదీర్ఘ కాలం కాపుల వద్ద బీజేపీ పగ్గాలు ఉన్నాయి. కాపులు రాజ్యాధికారానికి దూరంగా ఉండడంతో ఆ వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు బీజేపీ వ్యూహంతో ముందుకు సాగింది. కానీ జనసేనాని పవన్ దానికి బ్రేకులు వేశారు. పవన్ చరిష్మ ముందు బీజేపీ కాపు నినాదం తేలిపోయింది. అయితే ఇప్పుడు ఏకంగా కమ్మ సామాజికవర్గం…కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన పురంధేశ్వరికి అధ్యక్ష స్థానం ఇవ్వడం మాత్రం సంచలనం కలిగిస్తోంది.

త్రిపురలో ఇదే తరహాలో బీజేపీ హైకమాండ్ ఆలోచన చేసింది. కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతకు బీజేపీ పగ్గాలు అప్పగించింది. అక్కడ కాంగ్రెస్ నుంచి చేరికలకు అది ఎంతగానో దోహదపడింది. సామాజికవర్గ సమీకరణలు సైతం మారాయి. బీజేపీ ఫార్ములా వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు ఏపీలో కూడా పురంధేశ్వరిని అడ్డం పెట్టుకొని త్రిపుర తరహాలో ఒక ఫార్ములా అమలుచేస్తున్నట్టు ఉంది. ఆమె ఎన్టీఆర్ కుమార్తె. పైగా కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన మహిళా నాయకురాలు. ఇవన్నీ పార్టీకి లాభిస్తాయని హైకమాండ్ ఒక ఆలోచనతో ఉంది.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోని అసంతృప్తిగా ఉన్న కమ్మ నాయకులను ఆమె బీజేపీ గూటికి తెచ్చే అవకాశముంది. రాజకీయాలపై మక్కువ ఉండి అవకాశం లేని కమ్మ తటస్థ నాయకులను సైతం ఆకర్షించే చరిష్మ పురంధేశ్వరి సొంతం.కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంతో పనిచేసిన అనుభవం ఉంది. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ, వైసీపీలో అవకాశాలు లేని చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయారు. అటువంటి వారు పురంధేశ్వరి చొరవతో బీజేపీలోకి వచ్చేందుకు సుముఖత చూపుతారు.

తెలుగుదేశం నాయకత్వాన్ని కట్టడి చేసేందుకు కూడా పురంధేశ్వరి నియామకం దోహదపడుతుంది. మొన్నటివరకూ చంద్రబాబు నాయకత్వాన్ని పురంధేశ్వరి వ్యతిరేకిస్తూ వచ్చారు. కానీ ఇటీవల చంద్రబాబు కుటుంబంతో దగ్గరయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేస్తారని ప్రచారం సాగింది. వాటన్నింటినీ బ్రేక్ చేస్తూ బీజేపీ అగ్రనాయకత్వం ఏకంగా రాష్ట్ర పగ్గాలనే అప్పగించింది. పొత్తు ఉన్నా, లేకపోయినా టీడీపీకి ధీటైన నాయకత్వాన్ని తయారుచేయాలన్న ఉద్దేశ్యంతోనే బీజేపీ హైకమాండ్ ఒక వ్యూహం ప్రకారం నడుచుకున్నట్టు పురంధేశ్వరి నియామకంతో తేటతెల్లమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.